ఇందుకేనా అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నది ?

అసలు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు ? అసలు సమావేశాల అవసరం ఏమిటి ? అనేది సామాన్యుడిని తొలిచేస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే ఒకపుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారంటే ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు సూచిస్తారని జనాలు అనుకునే వారు. కానీ రాను రాను అసెంబ్లీ సమావేశాలంటే కేవలం పార్టీల పార్టీల బలప్రదర్శనకు అదొక వేదిక అయిపోయిందనే అభిప్రాయం మొదలైంది. చివరకు రాష్ట్ర విభజన తర్వాత నుండి జరుగుతున్న సమావేశాలు జనాభిప్రాయాన్ని నిజం చేసేస్తున్నాయి.

తాజాగా జరుగుతున్న ఐదు రోజుల శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే అందరు ఆశ్చర్యపోతున్నారు. సమస్యలపై చర్చించటం, పరిష్కారాలను కనుక్కోవటం మాట అంటుంచితే ఒకరిని మరొకరు నోటికొచ్చినట్లు తిట్టేసుకోవటంతోనే సరిపోతోంది. టీడీపీ సభ్యులు వైసీపీ సభ్యులను రెచ్చగొట్టడం, వైసీపీ సభ్యులు టీడీపీ సభ్యులపై విరుచుకుపడటంతోనే సభా సమయం అంతా సరిపోతోంది. ఒకపుడు సభ్యులు హద్దులు మీరితే అదుపుచేయటానికి స్పీకర్ జోక్యం చేసుకునే వారు. ఎందుకంటే అప్పట్లో స్పీకర్ కుర్చీకి పార్టీల రహితంగా సభ్యులందరు అంత మర్యాద చూపించేవారు.

వైఎస్ హయాం నుంచి ఆ పద్ధతి మారిపోయింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా అదే కొనసాగింది. సమైక్య రాష్ట్రంలో ఏమి జరిగిందనే విషయాన్ని వదిలిపెట్టి విభజిత రాష్ట్రంలో అయినా కొత్తగా సభను నడుపుదామనే ఆలోచన పాలకులకు రాకపోవటం నిజంగా దురదృష్టమనే చెప్పాలి. టీడీపీ అధికారంలో ఉన్నపుడు వైసీపీ ఎంఎల్ఏలకు ఏమాత్రం విలువిచ్చింది లేదు. పైగా ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని అప్పటి మంత్రులు వ్యక్తిగతంగా చాలా డ్యామేజింగ్ గా మాట్లాడారు. చంద్రబాబునాయుడు కానీ స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాదరావు కానీ వారిని వారించిన పాపాన పోలేదు.

అప్పటి మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని, రావెల లాంటి వాళ్ళంతా జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని తిడుతుంటే చంద్రబాబు ముసి ముసి నవ్వులు నవ్వుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. జగన్ ఏ అంశాన్ని ప్రస్తావించినా టీడీపీ వాళ్ళు మాత్రం తాత, తండ్రులు రాజారెడ్డి, వైఎస్సార్ ఫ్యాక్షనిస్టులని జగన్ పై విరుచుకుపడియిన ఘటనలు అందరు చూసిందే. అప్పటి టీడీపీ వాళ్ళ యాక్షన్ కే ఇప్పటి వైసీపీ వాళ్ళ రియాక్షన్.

తాజా సమావేశాల్లో చంద్రబాబును టార్గెట్ చేసుకుని మంత్రులు కొడాలినాని, అనిల్ కుమార్ లాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అనరాని మాటలను చంద్రబాబును అంటుంటే ఇపుడు జగన్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. నిజానికి అందరు కలిసి సభా గౌరవాన్ని మంట కలిపేస్తున్నారన్న విషయాన్ని మరచిపోతున్నారు. నువ్వు రెండంటే నేను నాలుగంటాను అనే పంతానికి పోయి సభలోనే బూతులు తిట్టేసుకుంటున్నారు. సమావేశాలను చూస్తున్న జనాలు సభ్యుల ధోరణులను చూసి విస్తుపోతున్నారు. అసలు సమావేశాలు ఎందుకు పెడుతున్నారయ్యా అంటే బూతులు తిట్టటం, తిట్టించుకోవటం కోసమే అన్నట్లుంది. ఇంతోటి దానికి అసలు అసెంబ్లీ సమావేశాలు పెట్టడం దేనికో ?