‘చంద్రబాబు రేవంత్ రెడ్డి గురు శిష్యులని మాకు తెలుసు’

నిన్న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం, నవ్వుతూ మాట్లాడుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు సీఎంలు కలవడం ఇది తొలిసారి కాదు.

పెట్టుబడిదారుల సదస్సు విజయవంతం అయిన జోష్ లో చంద్రబాబు ఉన్నారు. అటు జూబ్లీహిల్స్ అభ్యర్దిని గెలిపించుకున్న ఆనందంలో రేవంత్ ఉన్నారు. నాడు గురు శిష్యులు, నేడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయినా గురువు చంద్రబాబు ముందు ఎప్పుడూ నేను శిష్యుడనే అన్నట్టు రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలుగుదేశం నుండి వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలైనా , రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లినా తన మాటల్లో, ప్రవర్తనలో గురువు పట్ల గౌరవం, అభిమానం అణువణువునా కనిపించాయని అక్కడున్న వారంతా అనుకున్నారు. 

ఇదే వేదికపై మాట్లాడిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆంధ్రా తెలంగాణ ముఖ్యమంత్రులు గురు శిష్యులు అని మాకు తెలుసు. ఆంధ్రా – తెలంగాణ రెండు కలిసి అభివృద్ధి చెందాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరూ నవ్వులు చిందిస్తూ ముచ్చటించుకున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ, న్యాయ, సాంస్కృతిక, సామాజిక రంగాలన్నిటి నుండి ప్రముఖులు హాజరయ్యారు.