బీహార్ దంగ‌ల్‌: ఎన్డీయేకు అనూహ్య విజ‌యం!

దేశంలో అత్యంత ఉత్కంఠ‌కు దారితీసిన కీల‌క‌మైన ఎన్నిక బీహార్ అసెంబ్లీ పోలింగ్. 243 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో రెండు ద‌శ‌ల్లో ఎన్నికల పోలింగ్ జ‌రిగింది. నిజానికి ఈ ఎన్నిక‌.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకంటే కూడా.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మ‌హాగ‌ఠ్ బంధ‌న్‌కు అత్యంత కీల‌కంగామారింది. ఎందుకంటే.. ఈ ఎన్నిక‌ల్లోగెలిచి తీర‌క‌పోతే.. ఇక‌, పార్టీల‌కు ప్ర‌మాదక‌ర సంకేతాలు త‌ప్ప‌వ‌న్న వాద‌న వినిపించింది. ఈ నేప‌థ్యంలోకాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మ‌హా గ‌ఠ్ బంధ‌న్ కూట‌మి ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.

కానీ, అనూహ్య విజ‌యం మాత్రం బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీయేకు దక్క‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి స‌ర్వే ఫ‌లితాల‌కంటే కూడా.. బీహార్లో ఎన్డీయే కూట‌మి విజృంభించ‌డం గ‌మ‌నార్హం. మొత్తం 243 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 190 స్థానాలు ద‌క్కాయి. మ‌హాగ‌ఠ్ బంధ‌న్‌కు కేవ‌లం 49 స్థానాలే ద‌క్క‌డం గ‌మ‌నార్హం. ఇత‌రులు 4 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. మొత్తంగా చూస్తే.. ఇది ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు అనూహ్య విజ‌య‌మేన‌ని చెప్పాలి. ఇంత భారీ మెజారిటీ గ‌తంలోనూ రాలేద‌ని చెప్పాలి.

ముఖ్యంగా బీజేపీ తిరుగులేని విధంగా 84 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుని కూట‌మిలో అతి పెద్ద‌పార్టీగా అవ‌త‌రించింది. ఇక, జేడీయూ కూడా 76 స్థానాలు ద‌క్కించుకుంది. వాస్త‌వానికి 2020లో జ‌రిగి న ఎన్నిక‌ల్లో నితీష్ నేతృత్వంలోని జేడీయూ భారీ సంఖ్య‌లో సీట్లు గెలుచుకుంది. ఈ ద‌ఫా బీజేపీ పైచేయి సాధించింది. ఇక‌, ఈ కూట‌మిలోని ఇత‌ర పార్టీలు కూడా 30 స్థానాలు ద‌క్కించుకున్నాయి. దీంతో తిరుగులేని విధంగా ఎన్డీయే కూట‌మి ఈ ఎన్నిక‌ల్లోస‌త్తా చాటింద‌న్న వాద‌న బ‌లంగావినిపిస్తోంది.

ఇదేస‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మ‌హాగ‌ఠ్ బంధం ప‌రిస్థితి లేచి ప‌డిన కెర‌టంగా మారింది. ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు రోజు ఉద‌యం నుంచి రౌండ్ రౌండ్ కు ఈ కూట‌మి సీట్లు పెరుగుతూ వ‌చ్చినా.. చివ‌ర‌కు.. వ‌చ్చే స‌రికి త‌గ్గుతూ వ‌చ్చాయి. కాంగ్రెస్ 5 చోట్ల‌, మిత్ర‌ప‌క్షం ఆర్జేడీ 34 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ఇక‌, ఈ కూట‌మిలోని ఇత‌ర ప‌క్షాలు 8 స్థానాలు దక్కించుకున్నాయి. సో.. ఎలా చూసుకున్నా.. కాంగ్రెస్ కూట‌మి కుదేలైంద‌న్న వాద‌న మాత్రం బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.