ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ ‘సి.ఐ.ఐ పార్ట్నర్షిప్ సమ్మిట్-2025’ కోసం విశాఖ సన్నద్ధం అయ్యింది. విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్-2047’ థీమ్తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
100కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనే అవకాశంతో పాటు పెట్టుబడులకు సంబంధించి 30కి పైగా అవగాహనా ఒప్పందాలు జరగనున్నాయి. బుధవారం నుంచి సదస్సు ముగిసే శనివారం వరకు వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి ఈ వేదిక నుంచి వారికి వివరించనున్నారు. అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రధాన థీమ్ సెషన్లు నిర్వహిస్తారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్బంగా ఈ సాయంత్రం విశాఖ నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న వివిధ అవకాశాలను ఆయనకు ముఖ్యమంత్రి వివరించారు.
గురువారం విశాఖలోని నొవటెల్లో ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియా – యూరప్ కోపరేషన్ ఫర్ సస్టెయినబుల్ గ్రోత్’ అంశంపై జరిగే ఇండియా– యూరోప్ బిజినెస్ రౌండ్టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. శుక్రవారం 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సును భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. సదస్సు రెండో రోజు శనివారం ఉదయం బ్లూమ్బెర్గ్ మీడియా ఇంటరాక్షన్లో సీఎం పాల్గొంటారు. తర్వాత రేమండ్, శ్రీసిటీ, ఇండోసోల్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. సదస్సు చివరిగా ఆయన మీడియాతో మాట్లాడుతారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates