హరీశ్ ప్రసంగం లో పస తగ్గిందా?

ఒకప్పుడు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మాట్లాడితే వంక పెట్టడానికి, వేలెత్తి చూపడానికి వీలు లేని విధంగా ఆయన మాటలు ఉండేవి. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, మేధావులు సైతం మాటకు మాట అనలేని పరిస్థితి ఉండేది. అలాంటి హరీశ్ రావు తాజాగా సీఎం రేవంత్‌పై చేసిన ఘాటు వ్యాఖ్యలకు చాలా సింపుల్‌గా కౌంటర్లు రావడం గమనార్హం.

ఇదంతా చూసినప్పుడు, హరీశ్ రావు అనుకున్నంతగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకోలేకపోయారా అన్న ప్రశ్న లేవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌పై మాటల దాడికి సిద్ధమైనప్పుడు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. తన మాటలకు సమాధానం ఇవ్వలేక ఆత్మరక్షణలో పడే పరిస్థితి రావడం, హరీశ్ రావు తన పాత దూకుడు కోల్పోయారని సూచిస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉందని హరీశ్ చేసిన వ్యాఖ్యల విషయానికొస్తే, దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు చూపించి మాట్లాడితే బాగుండేది. ఒకవేళ హరీశ్ అన్నట్లుగా ఒప్పందం నిజమైతే, ఇటీవల రేవంత్ కిషన్ రెడ్డిపై విరుచుకుపడిన తీరు ఎలా అర్థం చేసుకోవాలి?

పీజేఆర్ కొడుక్కి టికెట్ ఇవ్వలేదంటూ రేవంత్‌ను ప్రశ్నించిన హరీశ్ రావు, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ టికెట్ కూడా ఇవ్వలేదన్న విషయాన్ని మర్చిపోయారని కౌంటర్లు వస్తున్నాయి. జూబ్లీ ఉప పోరు సమయంలో కేటీఆర్ పదే పదే పీజేఆర్ పేరును ప్రస్తావించడమే కాకుండా, అధికారంలో ఉన్నప్పుడు పీజేఆర్ కుటుంబానికి ఎలాంటి పదవి ఇవ్వలేదని ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి.

కేసీఆర్ కట్టిన నిర్మాణాలకు రేవంత్ రిబ్బన్ కత్తిరిస్తున్నారన్న హరీశ్ వ్యాఖ్యకు కూడా కౌంటర్లు వచ్చాయి. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన మెట్రో రైలు ప్రాజెక్టును బీఆర్ఎస్ తమదేనని చెప్పుకున్నప్పుడు హరీశ్ ఆ విషయాన్ని ఎలా మిస్ అయ్యారని అడుగుతున్నారు.

వైఎస్‌ను విమర్శించిన రేవంత్ తీరును ప్రశ్నించిన హరీశ్ రావు, తమ అధినేత కేసీఆర్ గతంలో చంద్రబాబును ఇంద్రుడు, చంద్రుడిగా పొగిడిన తర్వాత విమర్శించిన విషయాన్ని ఎందుకు గుర్తు పెట్టుకోలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సత్యాన్ని హరీశ్ రావు ఈసారి మిస్ అయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి, హరీశ్ రావు ఈసారి ప్రసంగం లో పాస్ తగ్గిందనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.