మొన్న అమితాబ్ కాంత్‌.. నేడు గార్గ్‌.. బాబుపై ఎందుకీ వ్యాఖ్య‌లు!

రాజ‌కీయాలు వారు క‌డుదూరం. అభివృద్ధికి, ఆలోచ‌న‌ల‌కు మాత్ర‌మే చేరువ‌. వారే.. కేంద్రం స్థాయిలో ఉన్న స్థానాల్లో ప‌నిచేసిన అధికారులు. అంతేకాదు..దేశాన్ని మేలు మ‌లుపు తిప్పిన విభాగాల‌కు అధినాయ‌కులుగా ప‌నిచేశారు. అలాంటివారు..ఇప్పుడు రాజ‌కీయాల‌కు అతీతంగా సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఇది మేధావివ‌ర్గాల్లోనే కాదు.. పారిశ్రామిక‌, ఐటీ రంగాల ల‌బ్ధ ప్ర‌తిష్ఠుల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇంత‌కీ.. ఆ అధికారులు ఒక‌రు.. నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్‌. రెండోవారు.. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్య‌ద‌ర్శి(అత్యంత కీల‌క పోస్టు) సుభాష్ చంద్ర‌గార్గ్‌.

వీరిద్ద‌రికీ రాజ‌కీయ వాస‌న‌లు లేవు. అంతా విజ్ఞానం.. దూర‌దృష్టి.. దేశ ప్ర‌యోజ‌న‌మే వారికి వెన్నెముక‌. అంతేకాదు..వారు ఏ వ్యాఖ్య‌లు చేసినా.. వ్య‌క్తిగ‌త అభిప్రాయాలే త‌ప్ప‌.. ఎవ‌రి ప్రోద్బ‌ల‌మూ ఉండ‌దు. వారు అలా ఒక‌రి ప్ర‌భావానికి గుర‌య్యేవారు కూడా కాదు. ఇంత‌కు మించి వారి యాట్టిట్యూడ్‌ను చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ఇక‌, వారు నిర్వ‌హించిన ప‌ద‌వులు కూడా దేశానికి వ‌న్నెతెచ్చేవే. నీతి ఆయోగ్ సీఈవోగా ప‌నిచేసిన అమితాబ్ కాంత్ అనేక మార్పుల‌కు నాందిప‌లికారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో తీసుకున్న నిర్ణ‌యాల ఫ‌లితంగానే రాష్ట్రాల‌కు ప‌న్నుల్లో వాటా పెరిగింది. దీనిని త‌ర్వాత కాలంలో ఆర్థిక సంఘాల‌కు బ‌దిలీ చేశారు.

ఇక‌, ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన గార్గ్ కూడా దేశ ఆర్థిక సుస్థిర‌త కోసం ప‌నిచేశారు. “నేను మీరు చెప్పిన‌ట్టు నిర్ణ‌యం తీసుకునేందుకుఅభ్యంత‌రం లేదు. కానీ, మా సెక్ర‌ట‌రీ లెక్క‌లు చూపిస్తున్నారు. ఆయ‌న ఒప్పుకోవ‌డం లేదు“ అని పార్ల‌మెంటు సాక్షిగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పిన మాట‌..అప్ప‌ట్లో గార్గ్ ఎంత నిక్క‌చ్చిగా ప‌నిచేశారో చెప్ప‌డానికి ఒక ఉదాహ‌ర‌ణ‌.

అలాంటి ఇద్ద‌రూ కూడా సీఎం చంద్ర‌బాబును ప్ర‌శంసించ‌డం అంటే.. మాట‌లు కాదు. ముందుకు అమితాబ్ కాంత్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న రెండు రోజుల కింద‌ట‌..ఎక్స్‌లో పోస్టు చేశారు. విశాఖ‌కు గూగుల్‌ డేటా కేంద్రం రావ‌డాన్ని ఆయ‌న వేనోళ్ల కొనియాడారు. ఇది సాధార‌ణ వ్య‌క్తులు.. ముఖ్య‌మంత్రుల వ‌ల్ల సాధ్యంకాద‌ని.. ఒక్క చంద్ర‌బాబు వంటివారి వ‌ల్లే సాధ్య‌మ‌ని పేర్కొన్నారు. ఆయ‌న విజ‌న్‌.. దూర‌దృష్టి వంటివి విశాఖ‌నే కాకుండా.. రాష్ట్రాన్ని దేశాన్నికూడా.. ప్ర‌పంచానికి త‌ల‌మానికంగా నిల‌బెడ‌తాయ‌న్నారు

ఇక‌, గార్గ్ విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబు ఎంత చ‌మ‌త్కారో అర్ధ‌మ‌వుతుంది. ఆయ‌న విజ‌న్‌.. ప్రణాళిక‌లు వంటివి ఎంత‌టి వ్య‌క్తుల‌నైనా ఇట్టేక‌రిగిస్తాయంటూ.. గతాన్ని, ప్ర‌స్తుతాన్ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. గ‌తంలో వాజ‌పేయిని ఒప్పించి ఉమ్మ‌డి రాష్ట్రానికి స్వ‌ర్ణ చ‌తుర్భుజి జాతీయ ర‌హ‌దారులు తెచ్చుకున్నార‌ని..ఇప్పుడు మోడీని మెప్పించి.. అనేక ప్రాజెక్టులు సొంతం చేసుకుంటున్నార‌ని.. ఇది ఊహించ‌ని మ‌లుపు అని గార్గ్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌పంచ బ్యాంకు ప్రాజెక్టుల‌లో 40 శాతం వ‌ర‌కు చంద్ర‌బాబు త‌న జేబులో వేసుకున్నార‌ని, కేంద్రం ఇచ్చే గ్రాంట్ల‌లో 30 శాతం వ‌ర‌కు ల‌బ్ధిపొందార‌ని ఆయ‌న తెలిపారు. ఇదంతా.. ఇత‌ర ముఖ్య‌మంత్రుల వ‌ల్ల సాధ్యం కాద‌ని.. పేర్కొన‌డం గ‌మ‌నార్హం.