రంగంలోకి కేసీఆర్‌.. మ‌రింత ప‌దునెక్క‌నున్న ప్ర‌చారం!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌.. గెలిచేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో భాగంగా ఇప్ప‌టికే రెండు కీల‌క అంశాల‌పై ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేస్తున్నారు. వీటిలో ఒక‌టి హైడ్రా, రెండు బ‌స్తీ ద‌వాఖానాలు(పీహెచ్‌సీ). ఈ రెండు అంశాల‌పైనా మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే.

పేద‌ల ఇళ్ల‌కు హైడ్రాశ‌త్రువు అంటూ.. కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ ఎస్ నేత‌లు సాధార‌ణ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లారు. ఇటీవ‌ల దీపావ‌ళిని కూడా ఇక్క‌డే ఆయ‌న నిర్వ‌హిస్తున్నారు. హైడ్రాతో పేద‌ల బ‌తుకులు ఆగ‌మాగం అయ్యాయ‌ని.. పేద‌ల్లో సెంటిమెంటును పురిగొల్పే య‌త్నం చేశారు. మ‌రోవైపు.. కేటీఆర్‌, హ‌రీష్ రావులు.. మంగ‌ళ‌వారం జూబ్లీహిల్స్ ప‌రిధిలోని పీహెచ్‌సీల్లో ప‌ర్య‌టించారు. రోగుల‌కు ఇస్తున్న మందులు, అందుతున్న సేవ‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ క్ర‌మంలో తాజాగా పార్టీ అధినేత‌, మాజీ సీఎంకేసీఆర్ కూడా దృష్టి పెట్టారు. పార్టీ సీనియ‌ర్లు, మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావు స‌హా ప‌లువురితో ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్ హౌస్‌లో ఆయ‌న భేటీ అయ్యారు. పార్టీ ప‌రంగా ఇంకా అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఆయ‌న దిశానిర్దేశం చేశారు. రోడ్ షోలు చేయాల‌ని.. బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించారు. అదేస‌మ‌యంలో మంత్రుల మ‌థ్య కీచులాట‌ను కూడా ప్రచారంలో చేర్చాల‌న్నారు.

మ‌రీ ముఖ్యంగా పేద‌ల‌ను సెంట్రిక్‌గా చేసుకుని ప్ర‌చారంపై దృష్టి పెట్టాల‌న్న కేసీఆర్‌.. నాయ‌కులు అంద‌రూ స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ‌మే కాకుండా.. బీజేపీని కూడా టార్గెట్ చేసుకోవాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు నివేదిక‌లు అందించాల‌ని కేసీఆర్ మాజీ మంత్రిహ‌రీష్‌రావుకు దిశానిర్దేశం చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ భారీ మెజారిటీతో మాగంటి సునీత విజ‌యం ద‌క్కించుకునేలా కృషి చేయాల‌న్నారు.