ఏపీలో ప్రధాని మోదీ నేడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కర్నూలు పర్యటనకు వచ్చిన మోదీకి ఓర్వకల్లు విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ తో మోదీ సరదాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బరువు బాగా తగ్గిపోయావని లోకేశ్ తో మోదీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గతసారి చూసినప్పటికంటే ఇప్పుడు చాలా బరువు తగ్గావని లోకేశ్ తో మోదీ అన్నారు. అంతేకాదు, త్వరలోనే మీ నాన్నలా తయారవుతావంటూ మోదీ చెప్పారు.
అంతకుముందు, ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఓర్వకల్లు నుంచి హెలికాప్టర్లో మోదీ సున్నిపెంట చేరుకున్నారు. అనంతరం రోడ్డుమార్గంలో శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి హెలీకాప్టర్లో నన్నూరుకు చేరుకొని రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ ‘సేవింగ్స్’ బహిరంగ సభలో పాల్గొంటారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు శంకుస్థాపన చేసి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 4.45 గంటలకు తిరిగి ఢిల్లీకి మోదీ పయనమవుతారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates