తెలంగాణ మంత్రి, సీనియర్ నాయకురాలు కొండా సురేఖకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగు తోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్లోని సురేఖ ఇంటి ముందు బుధవారం అర్ధరాత్రి తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది. మఫ్టీలో ఉన్న పోలీసులు నలుగురు ఒక్కసారిగా ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులను అడ్డుకున్నారు. వారు పోలీసులు అని తెలియక.. అసలు మీరెవరు..? ఎందుకు వచ్చారంటూ.. నిలదీశారు.
అంతేకాదు.. ప్రభుత్వం తమపై రౌడీలను ఉసిగొల్పిందంటూ.. నోరు జారారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కావడంతో తన తల్లిపై దాడులు చేసేందుకు కూడా సిద్ధమయ్యారని కొండా సుస్మిత వ్యాఖ్యానించారు. గత ఏడాది కాలంగా తమను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి పోలీసులు మఫ్టీలో వచ్చిన విషయాన్ని సుస్మిత గ్రహించలేదు. మరోవైపు మంత్రి సురేఖకు ప్రైవేటు ఓఎస్ డీ (ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్ను అరెస్టు చేసేందుకు వరంగల్ పోలీసులు వచ్చారు.
అయితే..వారుఎలాంటి వారెంటు లేకుండానే జూబ్లీహిల్స్లోని మంత్రి నివాసానికి వెళ్లడం తీవ్ర వివాదంగా మారింది. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేకపోవడంతో ఆమె కుమార్తె వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మొత్తానికి ఈ వ్యవహారం ఎలా ఉన్నా.. సుస్మిత చేసిన వ్యాఖ్యలు.. సర్కారుకు-సురేఖకు మధ్య ఉన్న గ్యాప్ను స్పష్టం చేస్తున్నాయన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. తమపై కొన్నాళ్లుగా దాడులు జరుగుతూనే ఉన్నాయని కొండా మురళి కూడా అంటున్నారు.
ఇక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని కూడా చెబుతున్నారు. ఇలా.. సురేఖ వర్సెస్ సర్కారు మధ్య కొంత గ్యాప్ నడుస్తున్న క్రమంలో ఇప్పుడు పోలీసులు వెళ్లిన వ్యవహారం మరింత రచ్చగా మారిందన్నది వాస్తవం. ఇక, సమంత్ అరెస్టు వెనుక.. రాజకీయ కోణం కూడా ఉందన్న చర్చ సాగుతోంది. ఆయనకు సురేఖ ఆర్థిక వ్యవహారాలు.. శాఖాపరమైన వ్యవహారాలు కూడా తెలుసునన్న వాదనా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన అరెస్టు కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయడం.. దీనిని సురేఖ కుమార్తె తీవ్రంగా పరిగణించడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates