కులాలు-క‌న్నీళ్లు: ‘జూబ్లీహిల్స్’ ర‌చ్చ ర‌చ్చ‌!

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌కు నామినేష‌న్ల ఘ‌ట్టం ప్రారంభ‌మైన 24 గంట‌లు కూడా గ‌డ‌వక ముందే.. పార్టీల మ‌ధ్య ర‌చ్చ రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్యే ఉంద‌న్న చ‌ర్చ నేప‌థ్యంలో ఇరు పార్టీల నాయకులు జోరుగా మాట‌ల మంట‌లు మండిస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ మంత్రులు.. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు ఇక్క‌డ నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన మాగంటి సునీత‌ను తీవ్రంగా విమ‌ర్శించార‌ని బీఆర్ఎస్ నాయ‌కులు ఆరోపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌హా ప‌లువురు నాయ‌కులు మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా వారు మంత్రుల‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. సోమ‌వారం ర‌హ్మ‌త్ న‌గ‌ర్ లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మాగంటి సునీత‌, కేటీఆర్‌, హ‌రీష్‌రావులు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మృతి చెందిన త‌న భ‌ర్త‌, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను త‌లుచుకుని సునీత క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పిల్ల‌లు కూడా విల‌పించారు. ఇదేస‌మయంలో గోపీనాథ్ చిత్ర‌ప‌టాల‌కు నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇవి పెద్ద‌గా హైలెట్ కాలేదు. కానీ, మంత్రులు పొన్నం, తుమ్మ‌ల ఈ సంద‌ర్భాన్ని విమ‌ర్శించార‌ని.. శ్రీనివాస్‌గౌడ్ స‌హాప‌లువురు నాయ‌కులు పేర్కొన్నారు.

సునీత‌ది క‌న్నీరుకాద‌ని.. అదో డ్రామా అని తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్ విమ‌ర్శించిన‌ట్టు మ‌హేష్‌గౌడ్ నిప్పులు చెరిగారు. అంతేకాదు.. మాగంటి కుటుంబం ఫొటోల‌తో వ‌చ్చి నాట‌కాలకు తెర‌దీసింద‌ని కూడా అన్నార‌ని వ్యాఖ్యానించారు. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడ‌ని.. అదే సామాజిక వ‌ర్గానికి చెందిన తోబుట్టువులాంటి సునీత‌ను ఇలా విమ‌ర్శిస్తారా? అని ప్ర‌శ్నించారు. బ‌హిరంగ వేదిక‌ల‌పై క‌న్నీరు పెట్టుకున్నారంటే.. ఎంత బాధ ఉంటే అలా చేస్తార‌ని ప్ర‌శ్నించారు. మృతి చెందిన వారి విష‌యంలో క‌నీసం మాన‌వ‌త్వం కూడా చూప‌లేద‌న్నారు. క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌లంతా ఒక్క‌టై సునీత‌కు అండ‌గా నిలుస్తార‌ని.. ఇలాంటి విమ‌ర్శ‌ల‌ను వారు స‌హించ‌లేర‌న్నారు.

ఇక‌, పొన్నం ప్ర‌భాక‌ర్ కూడా ఇలానే వ్యాఖ్యానించార‌ని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆయ‌న‌కు అస‌లు మంత్రి ప‌ద‌వి ఇచ్చి త‌ప్పు చేశార‌ని.. అన్నారు. మాగంటి గోపీనాథ్ చనిపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిందని గుర్తుచేశారు. మాగంటి సునీత బిడ్డలు, కొడుకు ప్రచారం చేస్తే యాక్షన్ ఎలా అవుతుంది..? రాజీవ్‌గాంధీ మ‌ర‌ణించిన‌ప్పుడు ఆయ‌న ఫొటోలు ప‌ట్టుకుని ఓట్లు అడ‌గ‌లేదా? అని ప్ర‌శ్నించారు. పొన్నం వ్యాఖ్య‌లు చేస్తుంటే.. ప‌క్క‌నే మ‌హిళా మేయ‌ర్ ఉన్నార‌ని.. ఆమెకూడా స్పందించ‌లేద‌న్నారు. ఈ విష‌యాల‌ను జూబ్లీహిల్స్ ప్ర‌జ‌లు గుర్తుంచుకుంటార‌ని.. త‌గిన స‌మ‌యంలో మంత్రుల‌కు బుద్ధి చెబుతార‌ని అన్నారు.