గత వారం పది రోజులుగా ఏపీని కుదిపేస్తున్న నకిలీ లిక్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మద్యం తయారు చేస్తున్న కీలక నిందితుడు కేసులో ఏ-1గా ఉన్న జనార్దన్రావు తాజాగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశే తమతో నకిలీ మద్యం తయారు చేయిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు, ఆయన ఆదేశాల మేరకే తాము తంబళ్లపల్లి నియోజకవర్గంలో నకిలీ లిక్కర్ తయారీకి డంప్ ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. అదేవిధంగా మార్కెటింగ్ వ్యవహారాలను కూడా జోగి అనుచరులకు ఇవ్వాలని అనుకున్నామని తెలిపారు.
“రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిఘా పెరిగింది. పైగా తక్కువ ధరలకే మద్యం అందుబాటులోకి తెచ్చారు. 100 రూపాయలకే లిక్కర్ అందుబాటులోకి వచ్చాక నకిలీ మద్యం అవసరం లేదు. అందుకే మేము మౌనంగా ఉన్నాం. అయితే గత ఏప్రిల్లో మాజీ మంత్రి జోగి రమేష్ నాకు ఫోన్ చేశారు. ఏం చేస్తున్నావని అడిగారు. మద్యం తయారీలో ఉన్నావా అని ప్రశ్నించారు. లేనని చెప్పా. అనంతరం ఆయన మళ్లీ నువ్వు పనిలోకి దిగాలి, అవసరమైతే పెట్టుబడి ఇస్తాను అన్నారు. ఆ వెంటనే ఆయన ఇంటికి సమీపంలోనే ఇబ్రహీంపట్నం (విజయవాడ శివారు)లో తయారీ చేపట్టాం” అని జనార్దన్రావు వివరించినట్టు పోలీసులు తెలిపారు.
ఇక ఆ తర్వాత ఎక్కడ నుంచి వ్యాపారం ప్రారంభించాలన్న విషయంపైనా జోగి సూచనలు చేశారని చెప్పారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి అయితే కరెక్ట్ అని, అది చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఆ ప్రాంతం నుంచి చేపట్టాలని జోగి సూచించినట్టు జనార్దన్ వివరించారు. తద్వారా ఈ విషయాన్ని బయట పెడితే చంద్రబాబుకే బ్యాడ్ నేమ్ వస్తుందని, పార్టీ వ్యూహంలో భాగంగా తామే ఒక రోజు ముందుగా సమాచారం ఇస్తామన్నారు. అయితే ఇంతలోనే పోలీసులు తమను పట్టుకున్నట్టు వివరించారు. ఈ మొత్తం వ్యవహారం నుంచి తాము తప్పుకున్నామని, అప్పట్లో వైసీపీ వారికి కూడా కొన్ని వాటాలు అందించారని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం వెనుక జోగి రమేష్ పాత్ర కీలకంగా ఉందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates