ప్రశాంత్ కిశోర్ పార్టీ.. అభ్యర్దులతో షాక్ ఇచ్చాడుగా!

ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ జన్ సూరాజ్ పార్టీనీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే బీహార్ ఎన్నికల కోసం తమ మొదటి అభ్యర్థుల లిస్ట్‌ను రిలీజ్ చేసి ఆశ్చర్యం కలిగించారు. ఎందుకంటే ఈ లిస్ట్‌లో మామూలు లీడర్లు కాకుండా, టెక్ట్స్‌బుక్స్ రాసిన ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు, మాజీ బ్యూరోక్రాట్లు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు, డాక్టర్లు వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు ఉండడం ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

మొత్తం 51 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో క్లీన్ ఇమేజ్ ఉన్నవారికే కిశోర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ అభ్యర్థుల ఎంపికలో కిశోర్ చేసిన ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కుమ్హర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ గణిత శాస్త్రవేత్త కేసీ సిన్హా పట్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆయన రాసిన లెక్కల పుస్తకాలను బీహార్‌తో పాటు చాలా రాష్ట్రాల్లో తరతరాలుగా ఫాలో అవుతున్నారు. అలాగే, మంఝీ నుంచి సీనియర్ అడ్వకేట్ వైబీ గిరి పోటీ చేస్తున్నారు. పట్నా హైకోర్టులో సీనియర్ లాయర్‌గా, కేంద్ర ప్రభుత్వ కేసులకు అడిషనల్ సాలిసిటర్ జనరల్‌గా కూడా ఆయన పనిచేశారు.

ముజఫర్‌పూర్ సీటు నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ అమిత్ కుమార్ దాస్ కూడా మెడికల్ కాలేజీలో చదివి, గ్రామీణ ప్రాంతాలకు హెల్త్ ఫెసిలిటీస్ అందించడానికి తన భార్యతో కలిసి ఒక హాస్పిటల్‌ను నడుపుతున్నారు. ఈ విధంగా డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెషనల్స్‌కు పెద్దపీట వేస్తూ, రాజకీయాల్లోని అవినీతికి చెక్ పెట్టాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్లు ప్రశాంత్ కిశోర్ ఇదివరకే చెప్పారు. ఇక ఈ లిస్ట్ ద్వారా క్లియర్‌గా అ సందేశం అందుతుందో లేదో చూడాలి.

రిలీజ్ చేసిన లిస్ట్‌లో మతం, సామాజిక వర్గాల బ్యాలెన్స్ కూడా కనిపించిందని పార్టీ వర్గాలు హైలెట్ చేస్తున్నాయి. ఈ లిస్ట్‌లోని అభ్యర్థుల్లో 16 శాతం మంది ముస్లింలు కాగా, 17 శాతం మంది అతి వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఉన్నారని చెబుతున్నారు. సామాజిక న్యాయంతో పాటు, విద్యావంతులను, క్లీన్ ఇమేజ్ ఉన్నవారిని ముందుకు తీసుకురావాలనేది జన్ సూరాజ్ పార్టీ మెయిన్ గోల్‌ అని ప్రమోట్ చేస్తున్నారు.

అయితే, ఈ మొదటి లిస్ట్‌లో ప్రశాంత్ కిశోర్ పేరు లేకపోవడం ఆయన పోటీ చేస్తారా లేదా అనే సస్పెన్స్‌ను కొనసాగించింది. గతంలో ఆయన ఆర్జేడీ కంచుకోట అయిన రఘోపూర్‌ నుంచో లేదా తన సొంత నియోజకవర్గం కర్ఘర్‌ నుంచో పోటీ చేస్తానని చెప్పారు. అయితే, కర్ఘర్ సీటు నుంచి నితేశ్ రంజన్ ను ప్రకటించారు. దీనిబట్టి చూస్తే, తేజస్వీ యాదవ్ సీటు అయిన రఘోపూర్ నుంచే కిశోర్ పోటీ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందని తెలుస్తోంది.

మొత్తంగా, మాస్ అప్పీల్ ఉన్న లీడర్లకు కాకుండా, ప్రొఫెషనల్స్‌కు, నిపుణులకు పెద్దపీట వేయడం ద్వారా, ప్రశాంత్ కిశోర్ ఈసారి బీహార్ ఎన్నికల కథనాన్ని కొత్తగా రాయడానికి ట్రై చేస్తున్నారని అర్థమవుతోంది. మరి ఈ ‘క్లీన్ ఇమేజ్’ టీమ్‌ను బీహార్ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి.