మ‌ళ్లీ కామెడీ అయిపోయిన బండి సంజ‌య్

Bandi Sanjay


కొన్ని రోజుల ముందు వ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీకి బ‌లం అనుకున్న వ్య‌క్తి ఇప్పుడు పెద్ద బ‌ల‌హీన‌త‌గా మారిపోతున్నాడు. సీనియ‌ర్ నాయకుడు లక్ష్మ‌ణ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్.. ప‌గ్గాలు చేప‌ట్టాక కొన్ని నెలలు బాగానే ప‌ని చేశారు. దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ పార్టీలో ఉత్సాహం తీసుకొచ్చారు.

దుబ్బాక ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న దూకుడు సానుకూల ఫ‌లితాలే ఇచ్చింది. కానీ జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మాత్రం మాత్రం ఆయ‌న బీజేపీకి పెద్ద భారంగా మారిపోతున్నారు. రోజుకో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌తో బండి సంజ‌య్ నెగెటివ్‌గా వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆయ‌న చేసిన కామెంట్లు కొన్ని మ‌రీ కామెడీ అయిపోతుండ‌టం పార్టీని కంగారు పెట్టేస్తోంది.

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించేవారిపై వేసే చ‌లాన్ల‌ను తాము అధికారంలోకి వస్తే జీహెచ్ఎంసీనే క‌డుతుందంటూ ఈ మ‌ధ్య ఒక హామీ ఇచ్చి తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌య్యారు సంజ‌య్. దాని మీద సోష‌ల్ మీడియా ఆయ‌న్ని ఏకిపారేసింది. ఇప్పుడు అలాంటి అర్థం లేని హామీ మ‌రొక‌టి ఇచ్చి దొరికిపోయారు సంజ‌య్. హైద‌రాబాద్‌లో వ‌ర‌ద‌లొచ్చి కార్లు, బైక్‌లు కొట్టుకుపోతే వాటి స్థానంలో కొత్త‌వి కొనిస్తామ‌ని తాజాగా ఒక ప్రెస్ మీట్లో హామీ గుప్పించేశారు సంజ‌య్.

దీని గురించి ఓ టీవీ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నిస్తే.. సంజ‌య్ ఇచ్చిన సమాధానం న‌వ్వుల పాలైంది. బైక్‌లు, కార్ల‌కు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబ‌ట్టి అవి వ‌చ్చేలా చూస్తాం అని ఆయ‌న బ‌దులివ్వ‌డం గ‌మ‌నార్హం. ఇన్సూరెన్స్ డ‌బ్బులు ఎవ‌రికి వాళ్లు తెచ్చుకుంటారు కానీ.. దీన్ని ఒక రాజ‌కీయ పార్టీ హామీగా ఇవ్వ‌డం ఏంటో సంజ‌య్‌కే తెలియాలి. సంబంధిత వీడియోతో సంజ‌య్‌ను మామూలుగా ట్రోల్ చేయ‌ట్లేదు సోష‌ల్ మీడియా జ‌నం.