ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కొత్త కొత్త విషయాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు శరన్నవరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ పేరిట ఓ భారీ కార్యక్రమంలో నిర్వహించాలని స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాంలు అహరహం శ్రమించారు. అయితే వీరి యత్నాలను అడ్డుకునేందుకు అటు విపక్ష వైసీపీతో పాటు కొన్ని హిందూ సంఘాలు యత్నించాయి. అయితే సోమవారం ఈ తరహా యత్నాలకు చెక్ పెడుతూ సుప్రీంకోర్టు విజయవాడ ఉత్సవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్సవాలను నిలిపివేయాలన్న పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.
దసరాను పురస్కరించుకుని గతంలో ఎన్నడూ లేని రీతిలో విజయవాడ ఉత్సవ్ ను నిర్వహించి ప్రపంచంలోనే నగరానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కూటమి సర్కారు భావించింది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించింది. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అంతరించిపోతున్న పురాతన కళలకు కూడా స్థానం కల్పించే దిశగా ప్లాన్ చేశారు. అయితే ఈ ఉత్సవాలు నిర్వహించే 3 ప్రదేశాల్లో ఓ స్థలం దుర్గ గుడికి చెందినది. అందులో వ్యాపార కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తారని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆధారం చేసుకుని కొన్ని హిందూ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఆలయ భూముల్లో వ్యాపార సంబంధిత కార్యక్రమాలకు వీల్లేదని తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం ద్విసభ్య ధర్మసనాన్ని ఆశ్రయించింది. సింగిల్ బెంచి ఇచ్చిన తీర్పుపై ద్విసభ్య ధర్మసనం స్టే విధించింది. దీంతో ఆ హిందూ సంఘాలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సత్వర విచారణ అవసరమన్న భావనతో కోర్టు ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలను తిరస్కరించిన కోర్టు విజయవాడ ఉత్సవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు పిటిషన్ వాదనలే సరికాదని కూడా కోర్టు అభిప్రాపడినట్టు సమాచారం. వెరసి విజయవాడ ఉత్సవ్ కు ఇక అడ్డంకుల్లేవని చెప్పాలి. ఈ ఉత్సవాలతో నగరానికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు దక్కుతుందని ఆశిద్దాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates