జీఎస్టీ 2.0తో మిడిల్ క్లాస్ కు డబుల్ బొనాంజా: మోదీ

కేంద్రం చెప్పినట్టుగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రసంగించారు. పెద్దగా సుత్తి లేకుండా రేపటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభవుతున్న నేపథ్యంలో జీఎస్టీ 2.0ను ప్రవేశెపెడుతున్నామని మోదీ చెప్పారు. ఈ పన్ను విధానం దేశంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుస్తుందని, దేశ ప్రజలకు ఏటా దాదాపుగా రూ.2.5 లక్షల మేర ఆదా అవుతుందన్నారు. ప్రత్యేకించి మధ్య తరగతి ప్రజలకు ఈ పన్ను విధానం ఓ డబుల్ బొనాంజా లాంటిదని మోదీ అభివర్ణించారు. నాగరిక దేవోభవ అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని ఆయన ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. 

దేశంలో వన్ నేషన్.. వన్ ట్యాక్స్ పేరిట నూతన పన్ను విధానాన్ని 2017లో తామే తీసుకున్నామని మోదీ చెప్పారు. అప్పటిదాకా అమలులో ఉన్న క్లిష్టమైన పన్ను వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేశామని తెలిపారు. నాడు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తు రవాణాకు నానా తంటాలు పడాల్సి వచ్చేదన్న మోదీ… దానిని జీఎస్టీ ద్వారా అత్యంత సరళతరం చేశామని తెలిపారు. శరన్నవరాత్రి తొలి రోజు నుంచే అమలులోకి రానున్న నూతన నెక్ట్స్ జనరేషన్ పన్ను విధానంలో కేవలం 2 శ్లాబ్ లే ఉంటాయని, అవి కూడా 5,18 శాతం శ్లాబ్ లేనని మోదీ తెలిపారు. ఈ శ్లాబ్ లతో దేశంలోని అన్ని వర్గాలకు భారీ ఊరట లభించనుందని ఆయన పేర్కొన్నారు.

ఆత్మ నిర్భర భారత్ ను నొక్కి మరీ చెప్పిన మోదీ… దేశ ప్రజలు స్వదేశీ వస్తువులనే వాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే దేశంలోకి చాలా విదేశీ వస్తువులు వచ్చాయని, ఇంకా వస్తూనే ఉంటాయన్న మోదీ… ఆత్మనిర్భర భారత్ సాకారం కావాలంటే.. ప్రజలు స్వదేశీకి మద్దతు తెలపాలని కోరారు. ఫలితంగా దేశం మరింతగా అభివృద్ది సాధ్యం అవుతోందని ఆయన పేర్కొన్నారు. దేశం సమృద్థిగా ఉండాలంటే దేశ ప్రజలు స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్య ద్వారా అమెరికా లాంటి అగ్ర దేశాలు భారత్ పై ట్యాక్స్ ల పేరిట ఒత్తిడి తీసుకువచ్చేందుకు అవకాశం ఉండదన్న భావనను మోదీ అంతర్లీనంగా వినిపించారు.