బాబు మార్క్ సంక్షేమం.. పశువులకూ హాస్టళ్లు

నిజమే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంక్షేమంలో తనదైన ప్రత్యేకతను చాటుతున్నారు. గతంలో పాలనా సంస్కరణలు, పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజల వద్దకే పాలన తదితర అంశాలపై దృష్టి సారించిన చంద్రబాబు… ఈ దఫా కూటమి సర్కారులో సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలను ఇప్పటికే అమలు చేస్తున్న బాబు…పీ4 పేరిట పేదల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించి అందరినీ ఔరా అనిపించారు. తాజాగా ఆయన పశువులకూ హాస్టళ్లు కట్టిస్తామని, తద్వారా పట్టణాల్లో పరిశుభ్రత, పశువుల రక్షణ సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.

శనివారం మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి పల్నాడు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఇప్పటిదాకా పిల్లలకు, వృద్ధులకు, అనాథలకు హాస్టళ్లు కట్టించామని, ఇప్పుడు పశువులకూ హాస్టళ్లను నిర్మించే దిశగా నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ దిక్కులు చూస్తుండగా… బాబు కూడా నవ్వుతూనే పశువుల హాస్టళ్ల వల్ల జరిగే మేలును వివరించారు. చంద్రబాబు నిర్ణయానికి సభకు వచ్చిన జనం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

గ్రామాల్లో ఎలాగూ పశు సంపద ఎక్కువగా ఉంటుంది. పాడి కారణంగా ఆయా కుటుంబాలే పశువుల ఆలనాపాలనా చూసుకుంటూ ఉంటాయి. అయితే పట్టణాల్లో మాత్రం కొందరి వద్ద ఒకటి, రెండు పశువులు ఉన్నా.. వాటిని అలా గాలికి వదిలేస్తున్నారు. ఇలా వదిలేసిన పశువులు పట్టణాల్లోని ప్రధాన వీధుల్లో చక్కర్లు కొడుతూ జనానికి ఓ మోస్తరు ఇబ్బందిని అయితే కలిగిస్తూ ఉంటాయి. అయినా పట్టణాల్లో పశువుల పోషణ కష్టంతో కూడున్నదే అయినా అలవాటు అయిన కుటుంబాలు వాటిని వదలేకపోతున్నారు.

ఈ పరిస్థితిని సోదాహరణంగా వివరించిన చంద్రబాబు… ఏదేనీ పట్టణాన్ని తీసుకుని అందులో ఎన్ని పశువులు ఉన్నాయన్న విషయాన్ని ముందుగా నిర్దేశిస్తామని తెలిపారు. ఆ తర్వాత ఆ పట్టణంలోని పశువులకు సరిపడే రీతిలో పశువుల షెడ్లను నిర్మిస్తామని చెప్పారు. ఆ తర్వాత పశువులన్నింటినీ అందులోకి తరలిస్తామన్నారు. పశువులకు ఏదో షెల్టర్ మాత్రమే ఏర్పాటు చేయకుండా వాటికి అవసరమై గడ్డి, తాగునీరు, ఇతరత్రా సౌకర్యాలనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రకటనకు సభకు వచ్చిన జనం జయజయ ధ్వానాలు పలికారు.