పెద్దిరెడ్డి.. జ‌గ‌న్‌ను ప‌క్క‌న పెట్టేశారా?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి. జగన్ పట్ల అత్యంత గౌరవం, మర్యాదలున్న నేత. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేశారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. అంతేకాదు, వైఎస్ కుటుంబంతోనూ అవినాభావ సంబంధాలు ఉన్న నాయకుడు.

జగన్ హయాంకు వచ్చినప్పటికీ ఆయన ప్రభావం ఏమీ తగ్గలేదు. అదే విధంగా కొనసాగింది. జగన్ కూడా తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఐదు సంవత్సరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి గానే కొనసాగారు.

ఎన్నికల్లో పార్టీ మొత్తం ఓడిపోయినప్పటికీ పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గెలుపొందారు. అదే విధంగా ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ స్థానం నుంచి కూడా వ‌రుస‌ విజయం సాధించారు. ఇలా పెద్దిరెడ్డి ఫ్యామిలీ రాజకీయంగా అప్రతిహతంగా కొనసాగుతోంది.

అయితే, గతానికి భిన్నంగా ఇప్పుడు పార్టీ నాయకుల మధ్య చర్చ నడుస్తోంది. జగన్ చెప్పిన సూచన, సలహాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కన పెట్టారని అవాస్తవం కాదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంతో, పెద్దిరెడ్డికి జగన్ కీల‌క సూచనలు చేశారు.

సభకు తాను రాకపోయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా మరికొందరిని వెళ్లాలని జగన్ సూచించిన విషయం నిజం. రెండు రోజుల క్రితం ఆయన కొన్ని సలహాలు, సూచనలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దిశానిర్దేశం చేశారు. సభలో బలమైన వాయిస్ వినిపించుకోవాలని, పేదలు, రైతుల సమస్యలపై వైసీపి తరఫున మాట్లాడాలని జగన్ సూచించారు.

అయితే, ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభకు రాకుండా కేవలం పార్టీ కార్యాలయానికి పరిమితం అయ్యారు.

అంటే, జగన్ చెప్పిన విషయాన్ని ఆయన పట్టించుకోలేదు. అంతేకాదు, జగన్ రాకుండా తాను ఎలా వెళ్తానని కూడా నాయకులతో చెప్పారు. పార్టీ వర్గాల్లో ఈ అంశంపై చర్చ జరుగుతోంది.

మరోవైపు, జగన్ చెప్పినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభకు రాకపోవడం పట్ల పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన కుమారుడు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టిన సందర్భంలో కూడా జగన్ పరామర్శించకపోవడం, మీడియా ముందు చర్చించకపోవడం పెద్దిరెడ్డిని ఆందోళనకు గురిచేశాయి.

ఈ ఆవేదన కారణంగా జగన్ మాటలను పెద్దిరెడ్డి పక్కన పెట్టారని చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి పెద్దిరెడ్డి కూడా సభకు రాకుండా మౌనంగా ఉన్నారు.