స‌భ‌కు రాకుంటే.. జీతం క‌ట్‌: అసెంబ్లీ కీల‌క తీర్మానం!

అసెంబ్లీకి రాకుండా వేతనాలు తీసుకోవడంతో పాటు తరచుగా గైర్హాజరవుతూ ఏదో మొక్కుబడిగా సభకు వచ్చే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ముందు మంత్రులు, పార్టీ విప్‌లు, అదేవిధంగా ముఖ్య నాయకులతో సమావేశమైన చంద్రబాబు నాయుడు, వైసీపీ నాయకులు సభకు రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సభకు రాకుండా జీతాలు తీసుకోవడం సరికాదన్నది.. గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. దీనినే తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు.

ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదన్న ఆయన.. దీనికి సంబంధించి తీర్మానం సిద్ధం చేసి ఆమోదించాలని కూడా నిర్ణయానికి వచ్చారు. సహజంగా పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించిన చట్టాలు, అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఈ చట్టాలు చేసే అధికారం ఉంటుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి రాకుండా వేతనాలు తీసుకునే వారి పట్ల ఉపేక్షించకుండా వారి జీతాలను కట్ చేసే విధంగా తీర్మానం చేసి దీనిని ఆమోదించి కేంద్రానికి పంపించాలని తాజాగా చంద్రబాబు నిర్ణయించారు.

ప్రస్తుతం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మరో 10 రోజులపాటు జరగనున్న నేపథ్యంలో ఈ తీర్మానంపై చర్చ కూడా పెట్టి సభ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అదే విధంగా తరచుగా అసెంబ్లీకి రాకుండా కేవలం లిఖితపూర్వక ప్రశ్నల ద్వారా సభలో సమాధానాలు కోరే వారిని కూడా ఇకనుంచి అనుమతించరాదన్న నిర్ణయంపై కూడా చంద్రబాబు చర్చించారు. భవిష్యత్తులో ఇటువంటి వారు ఉంటారని రాజ్యాంగంలో పేర్కొనలేదు కాబట్టే ఇలాంటి వారి ఆటలు సాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం.

సహజంగా రాజ్యాంగంలో సభకు రానివారికి జీతాలు ఇవ్వద్దని గాని, సభకు రాకుండా బయటే ఉండి ప్రశ్నలు అడగాలని గాని ఎక్కడ పేర్కొనలేదు. దీనికి కారణం చట్టసభల పట్ల అప్పట్లో ఉన్న సభ్యులకు గౌరవం, మర్యాద, ప్రజల పట్ల ఉన్న విశ్వసనీయత వంటివి దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ నిర్మాతలు ఈ విషయాన్ని రాజ్యాంగంలో చేర్చలేదు. దీనిని అడ్డుపెట్టుకుని వైసీపీ సహా అనేకమంది నాయకులు అధికారపక్షంలోని వారు కూడా సభకు రాకుండా లిఖిత‌ పూర్వక ప్రశ్నలు అడగడం, సభకు రాకుండానే వేతనాలు తీసుకోవడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నిజానికి ఒక ఏపీలోనే కాదు ఈ తరహా పరిస్థితి తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కేరళ ఇలా దక్షిణాది రాష్ట్రాలు అన్నిట్లోనూ కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో తొలి రాష్ట్రంగా అంటే ఈ తరహా విధానాలకు చెక్ పెట్టే విధంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిని కేంద్రం ఆమోదించాలి. పార్లమెంట్లో చట్టం చేయాలి. చాలా తతంగం ఉంది. అయినప్పటికీ ఒక హెచ్చరిక అయితే పంపించినట్లు అవుతుందన్నది చంద్రబాబు ఉద్దేశం గా ఉంది.