తెలుగు నేల రాజకీయాల్లో సత్తా కలిగిన నేతగా గుర్తింపు సంపాదించిన మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఏ రాజకీయ పార్టీలోనూ కుదురుగా ఉండలేకపోతున్నారు. తొలుత టీడీపీలో సుధీర్ఘ కాలం సాగిన సునీత ఆ తర్వాత వైసీసీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఆమె టీడీపీకి, ఆ పార్టీ నుంచి దక్కిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరిపోయారు. ఇక వైసీపీ అధికారం కోల్పోగానే ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి దక్కిన ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు. చాలా కాలం పాటు ఏ పార్టీ లేకుండానే సాగిన సునీత… తాజాగా ఆదివారం ఎన్డీఏ రథసారథి బీజేపీలో చేరిపోయారు. భర్త పోతుల సురేష్ తో కలిసి ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ప్రస్తుత తెలంగాణలోని గద్వాల జిల్లాలో జన్మించిన సునీత… విద్యాభ్యాసం నిమిత్తం ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండకు వెళ్లారు. 1984లో పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన సునీత అక్కడే డిగ్రీ కూడా పూర్తి చేశారు. అనంతరం టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల ముఖ్య అనుచరుడు పోతుల సురేష్ ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన సునీత… అటు గద్వాలతో పాటు ఇటు అనంతపురం జిల్లాల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం యత్నించారు. టీడీపీ అధిష్ఠానం చాలా సార్లు అవకాశం కల్పించినా కూడా ఆమె విజయం సాధించలేకపోయారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
ఎందుకో గానీ అధికారంలో లేని పార్టీల్లో కొనసాగేందుకు అంతగా ఇష్టపడని కారణంగానే సునీత ఇలా తరచూ పార్టీలు మారుతున్నారని చెప్పక తప్పదు. టీడీపీని వీడకుండా ఉండి ఉంటే… ఆమె ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో స్థానం దక్కించుకుని ఉండేవారన్న విశ్లేషణలు లేకపోలేదు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత టీడీపీలోకి వెళ్లేందుకు సునీత యత్నించినట్లు సమాచారం. అయితే వైసీపీలో ఉండగా… చంద్రబాబు, లోకేశ్ లపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన కారణంగా ఆమె ఎంట్రీకి టీడీపీ అధిష్ఠానం ససేమిరా అన్నట్టు సమాచారం. ఇక జనసేన కూడా ఎందుకనో గానీ ఆమెను అంతగా పట్టించుకోలేదు. చివరగా బీజేపీలో ఆమె చేరిపోయారు. మరి ఈ పార్టీలో అయినా ఆమె కుదురుగా ఉంటారో, లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates