సీఎం చంద్రబాబు అంటే.. పనిరాక్షసుడనే పేరు తెచ్చుకున్నారు. సరే.. ఆయన సంగతి పక్కన పెడితే.. ఆయన దగ్గర ప్రశంసలు దక్కాలంటే.. మాటలు కాదని అంటారు నాయకుల నుంచి అధికారుల వరకు కూడా. దీనికి కారణం.. అంత టఫ్ వర్క్ను ఆయన అప్పగించడమే కాదు, అంతే నిశితంగా కూడా గమనిస్తారు. ఎంతో కృషి చేస్తే తప్ప.. చంద్రబాబు దగ్గర మార్కులు సంపాయించుకోవడం అంత ఈజీ కాదు. తాజాగా ఆఘనతను సాధించారు .మంత్రి నారా లోకేష్. ఆయనకు తాజాగా అప్పగించిన పనిలో సక్సెస్ అయ్యారు.
నేపాల్లో నెలకొన్న అల్లర్లు, ఆందోళనల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారికి భరోసా నింపడంతో పాటు.. వారిని సురక్షితంగా తీసుకువచ్చే బాధ్యతను సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్కు అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన నారా లోకేష్ .. కేంద్రంలోని పెద్దలతో టచ్లో ఉండి.. నిరంతరం సమీక్షించారు. నేపాల్లో చిక్కుకున్న వారిని కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి సంప్రదించారు. వీడియో కాల్స్ చేశారు. యోగ క్షేమాలు తెలుసుకున్నారు., ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలను ఏర్పాటు చేసింది.
ఇక, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక విమానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి.. ఢిల్లీ నుంచి విశాఖకు.. ఇక్కడ నుంచి తిరుపతి, కడప జిల్లాలకు నడిపింది. తాజాగా 145 మంది ఒక్క ఏపీకి చెందిన వారే.. విశాఖకు చేరుకున్నారు. వారిలో 105 మంది ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాలకు(విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) చెందిన వారు ఉన్నారు. మిగిలిన వారిలో చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. వీరిని అదే విమానంలో కడపకు తరలించారు. కాగా.. విమానాశ్రయానికి చేరుకున్న వారిని(గురువారం రాత్రి 7 గంటల సమయంలో) ప్రత్యేక కార్లు, బస్సుల్లో వారి వారి ఇళ్లకు చేర్చారు. వారికి విమానాశ్రయంలో తాగునీరు, ఆహారం అందించారు.
సో.. మొత్తంగా.. నేపాల్ ఘటనలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా ఏపీకి తీసుకువచ్చే విషయంలో మంత్రి నారా లోకేష్ చూపిన చొరవ, ఉత్సాహం.. అప్పగించిన పనిని అర్జునుడిగా పూర్తి చేసిన విధంగా వంటివి చంద్రబాబుకు మంత్ర ముగ్ధుడిని చేశాయి. దీంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. “చూసి రమ్మంటే.. తీసుకొచ్చాడు.. శభాష్” అంటూ మంత్రి నారా లోకేష్ను అభినందించారు. అదేవిధంగా ఆయనకు సహాయకారులుగా ఉన్న మంత్రులు అనిత, దుర్గేష్లను కూడా చంద్రబాబు ప్రశంసించారు. మొత్తంగా నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారు 90 శాతం మంది చేరుకున్నట్టేనని అధికారులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates