మారిన లెక్క: మహానగరం కాదు.. అమరావతి మరో ప్రపంచం!

ఏపీ రాజధాని అమరావతిని ఇప్పటి వరకు మహానగరంగా, దేశంలోనే అతి కీలకమైన నగరంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏఐ యూనివర్సిటీ సహా క్వాంటమ్ వ్యాలీ వంటివి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు అమరావతి అంచనాలు మారుతున్నాయి. గతంలో 33 వేల ఎకరాలు చాలనుకున్న రాజధాని నగరానికి తాజాగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారు. దీనిలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ప్రపంచ స్థాయి క్రీడా నగరాన్ని కూడా నిర్మించనున్నారు.

ఇక తాజాగా మరిన్ని మార్పులు చోటుచేసుకున్నాయని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అధికారులు తెలిపారు. దీని ప్రకారం మహానగరం కాదు, మరో ప్రపంచంగా అమరావతి నిలుస్తుందని చెబుతున్నారు. ఇటీవల సవరించిన ప్రణాళిక ప్రకారం 70 ప్రాజెక్టుల నుంచి 110 ప్రాజెక్టుల వరకు అమరావతి నిర్మాణాలు పెరగనున్నాయని తెలిపారు. గతంలో పేర్కొన్న మాస్టర్ ప్లాన్‌లో ఉన్న రహదారులకు కొన్ని చోట్ల ఇబ్బందులు లేకుండా 4 చోట్ల ఎలివేటెడ్ కారిడార్లు (పై వంతెనలు, దిగువ వంతెనలు) నిర్మించాలని నిర్ణయించారు.

దీనిలోనూ ప్రభుత్వ కోర్ ఏరియా ఉండే ప్రాంతంలో రవాణా అడ్డంకులు లేకుండా నాలుగు కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ప్రాజెక్టుల్లో రూ. 50 వేల కోట్ల విలువైన 90 ప్రాజెక్టులకు టెండర్లకు ఆమోదం తెలిపారు. 78 ప్రాజెక్టు పనులను ఆయా సంస్థలకు కేటాయించారు. మొత్తంగా మరో ప్రపంచం ఆవిష్కృతం కానుంది. రైలు, రోడ్డు కనెక్టివిటీ, బుల్లెట్ రైలు ప్రతిపాదన, హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు 6 లేన్ల రహదారి నిర్మాణం, కృష్ణనది నుంచి అమరావతి వరకు రోప్‌వే, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి వంటివి కొత్త ప్రాజెక్టుల్లో చేరాయి.

దీంతో రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా అంతే వేగంగా పెరుగుతోంది. తొలుత 2015-16 మధ్య రాజధాని నిర్మాణానికి రూ. 64 వేల కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ తర్వాత ఇది లక్ష కోట్లకు చేరింది. ఇక తాజాగా పెరిగిన ప్రాజెక్టుల సంఖ్య కారణంగా ఈ వ్యయం రెండు లక్షల కోట్లకు చేరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేంద్రం 30 వేల కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకుల ద్వారా రాష్ట్రానికి రుణంగా ఇప్పిస్తున్న విషయం తెలిసిందే. గత బడ్జెట్‌లో కేంద్రం 1500 కోట్లను గ్రాంటుగా ఇచ్చింది. మిగిలిన సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం 2 వేల కోట్లు కేటాయించింది. విరాళాల రూపంలో కొంత మొత్తం సేకరిస్తోంది.

ఏదేమైనా చంద్రబాబు లక్ష్యం నెరవేరితే మహానగరం కాదు, అమరావతి మరో ప్రపంచంగా మారుతుందన్న చర్చ జరుగుతోంది.