భారత నూతన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్

భారత దేశ నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ఈ రోజు ఉదయం జరిగిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే అయినప్పటికీ…ఇండి కూటమి బలపరిచిన సుదర్శన్ రెడ్డి గట్టి పోటీ ఇస్తారని భావించారు. ఈ క్రమంలోనే ముందుగా ఊహించినట్లుగానే సీపీ రాధాకృష్ణన్ ఈ ఎన్నికలో గెలుపొందారు.

రాధా కృష్ణన్ కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. బిజూ జనతా దళ్ (బిజెడి), బీఆర్‌ఎస్, శిరోమణి అకాళీ దళ్ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. జార్ఖండ్, తెలంగాణ గవర్నర్‌ గానూ పనిచేశారు.

సౌత్ లో బీజేపీకి బలమైన ప్రతినిధిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆర్ఎస్ఎస్ తో బలమైన అనుబంధం కలిగి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. తమిళనాడు బీజేపీ యూనిట్‌ అధ్యక్షుడిగా పనిచేసిన రాధాకృష్ణన్.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లకు నమ్మకస్థుడు. రాధా కృష్ణన్ పాలనా అనుభవం, నిబద్ధత, పార్టీ పట్ల విశ్వసనీయత ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయి.