దేశ మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్కు ‘సెక్స్ కుంభకోణం’ కేసులో జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం నుంచి గత 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న దేవెగౌడ పెద్ద కుమారుడి కొడుకు ప్రజ్వల్.. ఇంట్లో పనిమనిషిని బెదిరించి సెక్స్ చేశారని, పలుమార్లు ఆమెతో ఉన్నారని, ఆయా దృశ్యాలు వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్నది కేసు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం కర్ణాటకలో పెను దుమారం రేపింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపింది.
విచారణలో ప్రజ్వల్ రేవణ్ణ అఘాయిత్యానికి పాల్పడిన వ్యవహారం రుజువు కావడంతో ఆయనకు స్థానిక కోర్టు జీవిత ఖైదును విధించింది. దీంతో ప్రస్తుతం పరప్పణ అగ్రహార జైల్లో ప్రజ్వల్ జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో జైలు నిబంధనల మేరకు ప్రజ్వల్కు పోలీసు అధికారులు ‘పని’ అప్పగించారు. దీని ప్రకారం.. వారంలో మూడు రోజుల పాటు ప్రజ్వల్ జైల్లో పనిచేయాల్సి ఉంటుంది. దీనికిగాను రోజువారిగా ఆయనకు వేతనం నిర్ణయించారు. రూ.522 చొప్పున రోజు వారిగా వేతనం ఇవ్వనున్నట్టు పరప్పణ అగ్రహార జైలు అధికారులు తెలిపారు. దీనిని నేరుగా ఆయన ఖాతాకు జమ చేయనున్నట్టు వివరించారు.
ఏం పని?
పరప్పణ అగ్రహార జైల్లో పెద్ద లైబ్రరీ ఉంటుంది. దీనికి క్లర్కుగా ప్రజ్వల్ను నియమించారు. ఈయన వారంలో మూడు రోజుల పాటు క్లర్కుగా పనిచేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం.. జైల్లోని ఖైదీలు కోరిన పుస్తకాలను వారికి ఇవ్వాలి. ఎవరెవరికి ఏయే పుస్తకాలు ఇచ్చారో నమోదు చేసుకోవాలి. అదేవిధంగా పుస్తకాలు తిరిగి ఇచ్చిన వారి వివరాలు నమోదు చేయాలి. లైబ్రరీలో పుస్తకాలను వరుసలో పేర్చాలి. బూజుదుమ్ము వంటివి తుడవాలి. పుస్తకాలు.. ఎవరూ దొంగిలించకుండా జాగ్రత్త వహించాలి. తాను పనిలో ఉన్న రోజులో లైబ్రరీ రక్షణ, పుస్తకాల జాగ్రత్తకు బాధ్యత వహించాలి. ఇలా.. ప్రధాన మంత్రి మనవడు ప్రజ్వల్ జైల్లో పనిచేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates