ఏపీలోని గ్రామీణ స్థాయిలో రాజకీయాలు పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామస్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా జనసేన పార్టీ ‘విలేజ్ పాలిటిక్స్’ పై దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న నేపథ్యంలో తమ పార్టీని పుంజుకునేలా చేయాలనేది జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహం గా ఉందని నాయకులు చెబుతున్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను నేరుగా గ్రామీణ ప్రాంతాలకే. పంచాయతీలకే ఆయన జమ చేయిస్తున్నారు. తద్వారా పనులు జోరుగా సాగుతున్నాయి. దీనిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పార్టీపరంగా జనసేన ప్రయత్నాలు ప్రారంభించింది.
గ్రామీణ స్థాయిలో పార్టీని డెవలప్ చేయటం.. గ్రామీణ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే దిశగా జనసేన అడుగులు వేస్తోంది. ఇది సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు తిరుగు ఉండదు అన్నది ఆ పార్టీ అంచనా. సాధారణంగా పట్టణాలు, నగరాల్లో ప్రజల ఆలోచనా స్థాయి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒకే దిశగా ఏ రోజు పట్టణ నగర స్థాయిలో ప్రజల ఆలోచన ఉండదు. సమయానుకూలంగా ఆలోచన మారడం, పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం అనేది కనిపిస్తుంది.
కానీ, గ్రామీణ స్థాయిలో ఒకసారి కనుక మంచి మార్కులు సంపాదించుకున్న పార్టీ… దాదాపు దశాబ్దాల తరబడి అదే స్థాయిలో కొనసాగుతూ ఉండడం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో వైసిపి ఇదే తరహా రాజకీయాలు చేసింది. వైయస్ సెంటిమెంట్ను, అదేవిధంగా ఆరోగ్యశ్రీ వంటి కీలక పథకాలను అడ్డుపెట్టి గ్రామీణ స్థాయిలో ఆ పార్టీ పుంజుకుంది. ఇప్పుడు అభివృద్ధిని ప్రాతిపదికగా చేసుకుని జనసేన కూడా అలాంటి వ్యూహాలతోనే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. గ్రామీణ స్థాయిలో డెవలప్ కావడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పట్టు సంపాదించే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తూ ఉండడం విశేషం. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates