లోక‌ల్ వార్‌… వైసీపీ రెడీయేనా ..!

ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది. ముఖ్యంగా పంచాయతీ ల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ ఇచ్చేశారు. దీంతో స్థానిక సమరం ఇక ప్రారంభం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమరంలో ఎవరు విజేత అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవమే. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీనే స్థానికంగా కూడా విజయం దక్కించుకుంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయం. గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది.

తాజా విష‌యానికి వ‌స్తే.. కూట‌మి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతరత్రా అభివృద్ధి, పెట్టుబ‌డుల క‌ల్ప‌న‌.. వంటివి ప్రభుత్వంపై ఉన్న సానుకూలతలు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీలను గెలిపించడం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరగబోయే ఎన్నికలు కూటమికి ప్ల‌స్ అవుతాయి అన్నది విశ్లేషకుల మాట. అయితే వైసిపి మౌనంగా ఉంటుందా? ఎన్నికల్లో సత్తా చూపించే పరిస్థితి ఉండదా? అంటే కచ్చితంగా ఉంటుంది. అందులో సందేహమేమీ లేదు.

అయితే కూటమి నాయకులకు ఉన్నంత బలంగానీ ప్రభుత్వానికి ఉన్నటువంటి బలం కానీ విపక్షంలో ఉన్న వైసిపికి ఇప్పుడు లేకపోవడం గ‌మ‌నార్హం. ఇటీవల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఏ మేరకు ఆ పార్టీ పుంజుకుంటుంది? ఏ మేరకు సత్తా చూపిస్తుంది అన్నది చూడాలి. ఇప్పటివరకు అయితే కచ్చితంగా కూటమిదే దాదాపు పంచాయతీల్లో హవా కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక‌, స్థానికంగా వైసీపీ ప్ర‌స్తుతం వెనుక‌బాటులోనే ఉంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ అస‌లు రెడీ అయ్యే అవ‌కాశం కొన్ని కొన్ని చోట్ల ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది కూడా చ‌ర్చనీ యాంశంగా మారింది. ఎందుకంటే.. గ్రామీణ స్థాయిలో గ‌తంలో త‌మ‌ను క‌నీసం నామినేష‌న్ కూడా వేయ కుండా వైసీపీ అడ్డుకుంద‌న్న ఆవేద‌న టీడీపీ, జ‌నసేన వ‌ర్గాల్లో ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వైసీపీని కూడా అదే రీతిలో అడ్డుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అంటే.. అస‌లు నామినేష‌న్ల ప‌ర్వంలోనే వైసీపీకి ఎదురుగాలి వీచే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. కాబ‌ట్టి.. వైసీపీకి ఈ ఎన్నిక‌లు పెద్ద సంక‌ట‌మేన‌ని మ‌రో వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.