అలా ఐతే సీబీఐ విచార‌ణ వ‌ద్దు: హైకోర్టు సంచ‌ల‌న ఆదేశం

తెలంగాణ ప్ర‌భుత్వానికి గ‌ట్టి షాక్ త‌గిలింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపిస్తూ.. నియ‌మించిన పీసీ ఘోష్ క‌మిష‌న్ ఇచ్చిన నివేదిక రాష్ట్రంలో రాజ‌కీయ దుమారం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సద‌రు క‌మిష‌న్‌పై ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నిప్పులు చెరుగుతోంది . దీనిని పీసీ ఘోష్ క‌మిష‌న్ కాద‌ని.. ఇది పీసీసీ క‌మిష‌న్ అని వ్యాఖ్యానిస్తోంది. ఈ క్రమంలోనే స‌ద‌రు క‌మి ష‌న్‌ను ర‌ద్దు చేశాయాల‌ని కోరుతూ.. హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే.

దీనిపై తాజాగా మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. సీబీఐ విచార‌ణ వ‌ద్ద‌ని ఆదేశించింది. అయితే.. ఇది పీసీ ఘోష్ క‌మిష‌న్ రిపోర్టును ఆధారంగా చేయ‌డానికి వీల్లేద‌ని పేర్కొంది. ఈ స‌మ‌యంలో స‌ద‌రు నివేదిక‌ను ర‌ద్దు చేసే విష‌యంపై బీఆర్ ఎస్ త‌ర‌ఫున న్యాయ‌వాది ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు. అయితే.. ఈ విష‌యం పెద్ద‌ది కాద‌న్న హైకోర్టు.. విచార‌ణ‌కు ప్రాతిప‌దిక‌ను మాత్ర‌మే తాము ప్ర‌శ్నిస్తున్న‌ట్టు పేర్కొంది. పీసీ ఘోష్ క‌మిష‌న్‌పై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో దీని ఆధారంగా మాత్ర‌మే సీబీఐని వేయడాన్ని నిలుపుద‌ల చేస్తున్నామ‌ని తెలిపింది.

ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న ప్ర‌భుత్వ త‌ర‌ఫున న్యాయ‌వాది, అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌.. స‌భ‌లో ఇప్ప‌టికే నిర్ణ‌యం జ‌రిగిపోయింద‌ని.. సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని సీఎం ప్ర‌క‌టించార‌ని తెలిపారు. అయితే.. పీసీ ఘోష్ క‌మిష‌న్ ఆధారంగా కాకుండా.. ఎన్‌డీఎస్ ఏ(నేష‌న‌ల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ) నివేదిక ఆధారంగా విచార‌ణ‌కు ఆదేశిస్తామ‌ని తెలిపారు. దీనికి హైకోర్టు మౌనం వ‌హించింది. ఇదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ న్యాయ‌వాది వాద‌న‌లు వినిపిస్తూ.. అస‌లు హ‌రీష్‌రావు వేసిన పిటిష‌న్‌కు వాలిడిటీ లేద‌న్నారు. దీనిని రద్దు చేయాల‌ని కోరారు.

కాగా.. హ‌రీష్‌రావు పిటిష‌న్‌ను ర‌ద్దు చేయాల‌న్న ప్ర‌భుత్వ అభ్య‌ర్థ‌న‌ను హైకోర్టు తోసిపుచ్చింది. విచార‌ణ‌ను వ‌చ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఇప్ప‌టికిప్పుడు సీబీఐ విచార‌ణకు మాత్ర‌మే బ్రేక్ ప‌డింది. ఇదేస‌మ‌యంలో హైకోర్టు ఆదేశాల‌తో మ‌రో విష‌యంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంటుంది. ఘోష్ క‌మిష‌న్ నివేదిక ఆధారంగానే సీబీఐ వేయ‌డానికి వీల్లేద‌ని చెప్పిన హైకోర్టు.. ఎన్‌డీఎస్ ఏ నివేదిక ఆధారంగా విచార‌ణ చేప‌ట్ట‌వ‌ద్ద‌ని చెప్ప‌క‌పోవడం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి.