ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో మహిళలు తమ వైపే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తల్లికి వందనం పధకం కింద.. లబ్ధిదారులైన ప్రతి మహిళకు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇచ్చామన్నారు. ఇప్పుడు స్త్రీ శక్తి ద్వారా ఉచిత ఆర్టీసీ పథకాన్ని అమలు చేస్తున్నా మని.. ఈ రెండు పథకాలపై మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పారు. తాజాగా సీఎం చంద్రబాబు.. మహిళల కోసం ఇటీవల ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై సమీక్షించారు. “ఎంత మంది ఎక్కారన్నది కాదు. ఎంత మందికి ఈ పథకం చేరువ అయిందనే విషయం ముఖ్యం” అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
మహిళల సహకారంతో స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో స్త్రీ శక్తి పథకంపై సమీక్షించారు. స్త్రీ శక్తి పథకం అమలు ఎలా ఉందని ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో ఎంత మేర పెరిగిందన్నారు. స్త్రీ శక్తి బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎదురువుతున్నాయా?, వాటిని ఎలా పరిష్కరిస్తున్నారన్న విషయాలను కూడా ఆయన తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం అమలు చేసినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, సీట్ల కోసం ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెప్పారు.
అయితే.. గతంలో మహిళల ఆక్యుపెన్సీ రేషియో 68 శాతం ఉండగా.. ప్రస్తుతం ఈ పథకం కారణంగా ఆక్యుపెన్సీ రేషియో 70 శాతం వరకు పెరిగిందన్నారు. ప్రధానంగా 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100 శాతం మహిళలే కనిపిస్తున్నారని, పురుషుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని.. ఎంత మంది మహిళలు ఎక్కినా.. వారికి అవకాశం ఇవ్వాలని,ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ఉచిత బస్సు వెసులుబాటును మహిళలు సద్వినియోగం చేసుకుంటుండడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
“ఏపీ మహిళల్లో చైతన్యం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఎలాంటి పథకాలను తెచ్చినా.. వాటిని సద్వినియోగం చేస్తారు. మహిళలంతా మావైపే ఉన్నారు” అని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పటి నుంచి మహిళలకు ప్రత్యేక పథకాలు ఇవ్వడానికి ఆసక్తి చూపించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలం భన కల్పిస్తే.. ఇప్పుడు స్త్రీ శక్తి ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించామని అన్నారు. విద్యార్థినులు, మహిళలం దరికీ ఉచిత బస్సు ప్రయాణం కానుకగా ఇచ్చామని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates