వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి ఉరఫ్ రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే లిక్కర్ కుంభకోణం ద్వారా ఆయన అక్రమ మార్గంలో కోట్ల రూపాయలు పోగేసుకున్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ సొమ్మును వైట్ చేసుకునేందుకు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్టు మద్యం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు. సినిమాలు సహా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ కసిరెడ్డి పెట్టుబడులు పెట్టినట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా 13 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడా రాజ్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆయా వివరాలను ప్రభుత్వానికి అందించారు. దీంతో రాజ్ కసిరెడ్డి ఆస్తులను సీజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తొలి వేటు!
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు ఆస్తులను సీజ్ చేసిన ఘటన ఇదే కావడం గమనార్హం. అదే విధంగా కీలక నేతలు, ఉన్నతాధికారులను కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేసినా వారి ఆస్తులపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవలి శంషాబాద్ శివారులో గుర్తించిన 11 కోట్ల రూపాయలను కోర్టు ఆదేశాల మేరకు బ్యాంకులో జమ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నిందితుల్లో నంబర్ వన్గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates