ఉచిత బస్సు: కూటమి గ్రాఫ్ 360 డిగ్రీస్

ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం సర్కారు గ్రాఫ్‌ను అమాంతం పైకి లేపేసింది. 360 డిగ్రీస్ స్థాయిలో కూటమి ప్రభుత్వానికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సంతోషంలో మునిగి పోయారు. కూటమి ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ శనివారం ఉదయం నాటికి స్త్రీ శక్తి పథకం సంపూర్ణంగా అమల్లోకి వచ్చింది.

మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుగా కూటమి ప్రభుత్వం 8 వేల పైచిలుకు బస్సులను ఏర్పాటు చేసింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సహా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటికి గ్రామ స్థాయి నుంచి నగర, పట్టణ స్థాయి వరకు మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పొద్దుపొద్దున్నే పనులకు వెళ్లేవారు, కార్యాలయాలకు వెళ్లేవారు కూడా ఉచిత బస్సును వినియోగించుకుంటున్నారు.

ఊహించలేదు

ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు పలువురు మాట్లాడుతూ తాము అస్సలు ఊహించలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకున్నప్పుడు తాము అస్సలు ఊహించలేదని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం తమకు ఉచిత బస్సును అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణంగా ఉందని పలువురు ఉద్యోగులు తెలిపారు.

నెలకు 2 వేలు ఆదా

మరికొందరు మహిళలు మాట్లాడుతూ తమకు కనీసంలో కనీసం 2 వేల చొప్పున నెలకు ఆదా అవుతుందని పేర్కొన్నారు. తాము పనులపై 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తామని దీనికి రోజుకు 70 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేదని ఇప్పుడు ఆ సొమ్ము మిగులుతుందని తెలిపారు. దీంతో నెల మొత్తం మీద 2000 వరకు ఆదా అవుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.