వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత బాధ ప్రపంచం బాధగా మారింది. నిజానికి తండ్రిని కోల్పోయిన బాధ ఎవరికైనా ఉంటుంది. అందునా, అయినవాళ్లే (ఆమె ఆరోపిస్తున్నట్టు) దారుణంగా నరికి చంపితే, కనీసం దీనిలో బాధ్యులు ఎవరో కూడా తెలియకపోతే ఎవరికైనా బాధ కలుగుతుంది. అదే బాధ, అంతకుమించి అన్నట్టుగా సునీత ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆరు ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఎవరు దోషులో తెలియని పరిస్థితి కొనసాగుతోంది.
సునీతపైకి చెబుతున్నా, వేళ్లు చూపుతున్నా, సీబీఐ దర్యాప్తులో ఏం తేలిందో, ఎవరి పై సీబీఐ అనుమానం, దోషత్వాన్ని చేర్చిందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. పైగా తమ విచారణ ముగిసిపోయిందని, ఇక తాము చేయాల్సిన దర్యాప్తు ఏమీలేదని సీబీఐ స్పష్టంచేసింది. ఈ పరిణామం సునీతకు మరింత ఇబ్బందిగా మారింది. ఇంకా విచారణ కొనసాగుతోందని తాము భావిస్తున్నట్టు ఆమె చెబుతున్నారు. కానీ సీబీఐ ఆకస్మికంగా విచారణ ముగిసిందని ప్రకటించింది.
ఈ పరిణామాలనే ఉటంకిస్తూ గత నాలుగు రోజులుగా సునీత సొంత ప్రాంతం పులివెందులలో ఉండి ప్రశ్నలు గుప్పిస్తున్నారు. తాను అడుగుతున్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారని కూడా ఆమె అంటున్నారు. ఇది కూడా నిజమే. వైసీపీ హయాంలో కేసు దర్యాప్తును ప్రభావితం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. అధికారులను తొక్కిపెట్టారని, దాడులు చేశారని, సాక్షులను ప్రభావితం చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన విచారణలో పారదర్శకతపై ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
ఒకరకంగా సునీత అంతరంగాన్ని పరిశీలిస్తే, ఆమె ఈ కేసు విచారణను మరోసారి పునఃప్రారంభించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. అందుకే తన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ వాస్తవానికి ఇప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వమే ఉండటంతో, ఆమె ఆలోచన మొత్తం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తిరిగి విచారణ చేపట్టాలనేదే. కానీ దీనికి సీబీఐ అంగీకరించడంతో పాటు కోర్టుల వరకు పోరాటం చేయాల్సి ఉంటుంది. అప్పటివరకు సునీత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం రానట్టే.
మరి ఇది జరుగుతుందా? అంటే వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates