వారికి ఉచిత బ‌స్సు.. వీరికి ఉచిత విద్యుత్‌: ఏపీ కేబినెట్

సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో భేటీ అయిన ఏపీ మంత్రివ‌ర్గం.. ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. మ‌హిళ‌ల‌కు ఈ నెల 15 నుంచి ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణాన్ని చేరువ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించినా.. మంత్రివ‌ర్గంలో చ‌ర్చించి తీసుకునే నిర్ణ‌యానికి మ‌రింత వాల్యూ ఉంటుంది. అందుకే.. కేబినెట్ నిర్ణ‌యం తీసుకున్నారు. అలానే.. నాయీ బ్రాహ్మ‌ణులు న‌డిపే సెలూన్ల‌కు.. ప్ర‌స్తుతం ఉన్న 150 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను 200 యూనిట్ల‌కు పెంచారు.

అంటే.. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వ‌ర‌కు కూడా.. సెలూన్ల‌లో వినియోగించే విద్యుత్‌కు 200 యూనిట్ల వ‌ర‌కు.. ఫ్రీగా ప్ర‌భుత్వం ఇవ్వ‌నుంది. అలానే.. ఈ నెల 25 నుంచి కొత్త రేష‌ణ్ కార్డుల‌ను పంపిణీ చేయ‌నున్నారు. అలానే.. ప్ర‌స్తుతం ఉన్న రేష‌న్ కార్డుల‌ను డిజిట‌ల్ రూపంలోకి మార్చి.. డిజిట‌ల్ కార్డుల‌ను ల‌బ్ధి దారుల‌కు అందించ‌నున్నారు. ఈ కార్డుల్లోనే ల‌బ్దిదారుల వివ‌రాలు.. చిప్‌లో నిక్షిప్తం చేయ‌బ‌డి ఉంటాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఇక‌, రాష్ట్రంలో సెప్టెంబ‌రు 1 నుంచి అమ‌ల్లోకి రానున్న నూతన బార్ పాలసీకి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనిలో క‌ల్లు గీత కార్మికుల‌కు 10 శాతం బార్ల‌ను కేటాయించారు. అంటే.. క‌ల్లు గీత కార్మికుల‌కు మాత్ర‌మే 10 శాతం బార్ల‌ను ఇవ్వ‌నున్నారు. అదేవిధంగా వారికి ద‌ర‌ఖాస్తు ఫీజులో కూడా రాయితీ ఇవ్వాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించింది. ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కి ఆమోదం తెలిపింది. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 22 ఏపీటీడీసీ హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు మంత్రి వ‌ర్గం అనుమతించింది.

తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో ఓబరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 25 ఎకరాల టీటీడీ భూ బదలాయింపును కేబినెట్ ర‌ద్దు చేసింది. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ కు ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు రూ.900 కోట్లు గ్యారెంటీ ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, ఏపీఐఐసీకి రూ. 7500 కోట్ల రుణం తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించేందుకు మ‌రో ఐదుగురు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల నియామ‌కానికి అనుమతి ఇచ్చింది.