బీజేపీ అధ్యక్షుడి నోట ఇవేం మాటలు?

రాజకీయ నాయకులు దూకుడుగా ఉండటం, ఆవేశంగా ఉండటం ఈ రోజుల్లో అవసరమే. పార్టీని నడిపించే వాళ్లు అలా ఉంటేనే జనాలకు నచ్చుతున్నారు. అందులోనూ అధికారంలో ఉన్న ఓ పెద్ద పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలని ప్రయత్నిస్తున్న పార్టీని నడిపిస్తున్న నాయకుడు అగ్రెసివ్‌గా ఉండటం అవసరమే. కానీ అగ్రెషన్ పేరుతో ఏది పడితే అది మాట్లాడేస్తే.. అర్థరహితమైన కామెంట్లు చేస్తే మాత్రం ఇబ్బందే. అప్పుడు అసలుకే మోసం వచ్చేస్తుంది.

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీరు చూస్తుంటే ఇలాగే ఉంది. సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టాక నిరంతరం వార్తల్లో ఉంటుండటం, పార్టీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండటం వాస్తవమే. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించడంలోనూ ఆయన పాత్ర కీలకమే. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి మంచి ఫలితాలు సాధించిపెట్టాలని అధికార పార్టీని ఢీకొట్టే క్రమంలో సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలే తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి

హిందువుల మనోభావాలను కాపాడటానికి హైదరాబాద్‌ను తగలబెట్టడానికైనా సిద్ధమే అంటూ ఇటీవల సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎంతగా దుమారం రేపాయో తెలిసిందే. హిందుత్వ సిద్ధాంతాల్ని చాటిచెప్పే క్రమంలో ఆయన చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. తాజాగా సంజయ్ ఒక ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి.

ఈ సారి ఆయన రోడ్డు భద్రత నిబంధనలు అధిగమించే వారికి జరిమానాలు విధించడం గురించి మాట్లాడారు. ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్లు, వాహనాల్లో రోడ్డును అడ్డ దిడ్డంగా క్రాస్ చేసేవాళ్ల మీద సంజయ్ సానుభూతి వ్యక్తం చేశారు. ఇలా నిబంధనలు అతిక్రమించే యువత మీద కేసీఆర్ ప్రభుత్వం చలాన్లతో విరుచుకుపడుతోందని.. కేసీఆర్‌కు యూతే టార్గెట్ అయిపోయారని.. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలకు డబ్బులిస్తుంటే వీళ్లను చలాన్ల పేరుతో ప్రభుత్వం దోచుకుంటోందని విచిత్రంగా వాదించిన సంజయ్.. హైదరాబాద్‌లో మేయర్ పదవి తమ పార్టీకి దక్కితే ఇకపై చలాన్లన్నింటినీ జీహెచ్ఎంసీనే కట్టేలా చూస్తామని ప్రకటించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు బీజేపీ మద్దతుదారులకే రుచించడం లేదు. ఈ వ్యాఖ్యల ఫలితంగా సంజయ్‌పై పెద్ద ఎత్తునే సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.