కౌశిక్ రెడ్డికి ఊహించని రిలీఫ్

బీఆర్‌ఎస్ ఫైర్‌బ్రాండ్ నాయకుడు, హూజూరాబాద్ నుంచి ఫస్ట్‌టైమ్ ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని రిలీఫ్ దక్కింది. పార్టీ తరఫున ఫైర్‌బ్రాండ్‌లా ఎగసిపడే కౌశిక్ రెడ్డి ఇటీవలి కాలంలో తన వాయిస్‌ను బలంగా వినిపిస్తున్నారు. అయితే ఇది ఒక్కొక్కసారి వివాదాలకు దారి తీస్తోంది. దీంతో కేసుల్లో చిక్కుకుంటున్నారు. కొన్నాళ్ల కిందట పార్టీ నుంచి బయటకు వచ్చిన గాంధీపై తీవ్ర విమర్శలు చేసి చిక్కుల్లో పడ్డ కౌశిక్ రెడ్డి, తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా 18 పోలీస్‌స్టేషన్లలో కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టారు. సీఎం పదవిని కొనుక్కున్నారని, సాగిల పడి సంపాయించుకున్నారని అప్పట్లో కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీనిపై కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన రెండు మూడు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చ తెరమీదికి వచ్చింది. దీనికితోడు ఇటీవలి శంషాబాద్‌లో ఆయనను అరెస్ట్ చేసిన ఘటన కూడా ఉంది.

దీంతో తాజాగా కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయ పరమైన కారణాలతోనే వ్యాఖ్యలు చేశానని, ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా తనపై కేసులు పెట్టారన్నారు. ఏ క్షణమైనా తనను అరెస్ట్ చేసి కస్టడీలో హింసించే అవకాశం ఉందని తెలిపారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, సదరు కేసులపై స్టే విధించాలని హైకోర్టును కోరారు. అంతేకాదు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే కేసుకు సంబంధించి బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన హైకోర్టు వెంటనే తీర్పు వెలువరించింది. కౌశిక్ రెడ్డిపై నమోదైన బహుళ ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ కేసు కారణంగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అయితే కేసులపై స్టే విధిస్తున్న కారణంగా ముందస్తు బెయిల్ ప్రస్తావన లేదని కోర్టు పేర్కొంది. ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది. దీంతో కౌశిక్ రెడ్డికి ఊహించని విధంగా రిలీఫ్ లభించడం గమనార్హం.