ఎమ్మెల్యేల జంపింగుల‌ విష‌యాన్ని 3 నెల‌ల్లో తేల్చండి: సుప్రీం

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేల‌కు చిక్కులు కొన‌సాగుతూనే ఉన్నాయి. త‌మ పార్టీ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకుని.. పొరుగు పార్టీలో చేరిన ఎమ్మెల్యే లను వ‌దిలేది లేద‌ని చెప్పిన బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ .. న్యాయ పోరాటం కొన‌సాగిస్తునే ఉన్నారు. తొలుత హైకోర్టు.. త‌ర్వాత సుప్రీంకోర్టు వ‌ర‌కు.. ఈ కేసును కొన‌సాగించారు. తాజాగా మ‌రోసారి సుప్రీంకోర్టు.. స్పందించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై మూడు మాసాల్లోగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని.. మ‌రోసారి తేల్చి చెప్పింది.

అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు కూడా చేసింది. ఈ మేర‌కు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ నేతృత్వంలోని బెంచ్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మూడు మాసాల్లోగా స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. మొత్తంగా బీఆర్ ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిన విష‌యం తెలిసిందే. పార్టీ అధికారం కోల్పోగానే కొంద‌రు.. త‌ర్వాత మ‌రికొంద‌రు.. అధికార పార్టీ గూటికి చేరారు. అయితే.. వీరిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్ ప్ర‌సాద‌రావుకు బీఆర్ఎస్ విన్న‌వించింది. ఆయ‌న ఈ విష‌యంలో ఆల‌స్యం చేస్తూనే ఉన్నారు.

దీంతో హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్‌కు.. సానుకూలంగానే తీర్పు వ‌చ్చింది. అయినా.. స్పీక‌ర్ ప‌ట్టించుకోలేదు. దీనిపై నేరుగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన బీఆర్ఎస్‌.. `మీరే వేటు వేయండి“ అని కోర్టును కోరింది. దీనిపైనే సుదీర్ఘ విచార‌ణ జ‌రిపిన కోర్టు.. మ‌రోసారి స్పీక‌ర్‌ ప్ర‌సాద‌రావుకే సూచ‌న‌లు చేస్తూ.. మూడు మాసాల్లోనే తేల్చేయాల‌ని పేర్కొంది. అయితే.. ఇది స్పీక‌ర్ విచ‌క్ష‌ణ‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని వ్యాఖ్యానించ‌డం కొస‌మెరుపు. తాము నేరుగా శాస‌న విధుల్లోకి జోక్యం చేసుకునేది లేద‌ని పేర్కొంది.

కీల‌క వ్యాఖ్య‌లు ఇవీ..

+ జంపింగ్‌ ఎమ్మెల్యేలపై కోర్టులు అనర్హత వేటు వేయ‌జాల‌వు.
+ ఇలాంటి ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలి.
+  పార్టీలు మార‌డం నిలువ‌రించేందుకు ఇప్ప‌టికే ప్రజాప్రాతినిధ్య చ‌ట్టం ఉంది. దీనిని బ‌లోపేతం చేయాలి. అమ‌లు చేయాలి.
+ స్పీక‌ర్‌లకు విచ‌క్ష‌ణాధికారం ఉన్నా.. ప‌రిమితులు ఉంటాయి.