మీ విజ‌న్ సూప‌ర్‌.. ఏపీకి వ‌స్తాం: బాబుకు హామీల వ‌ర‌ద‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు సింగ‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. గురువారంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న ముగియ‌నుంది. తొలి రోజు నుంచి ఆయ‌న పెట్టుబ‌డులు.. పీ-4పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు. సింగ‌పూర్‌లో రోడ్ షో కూడా నిర్వ‌హించి.. పారిశ్రామిక వేత్త‌ల‌ను ఆకర్షించే ప్ర‌య‌త్నం చేశారు. పెట్టుబ‌డులు.. విద్యా సంస్థ‌ల‌కు సంబంధించిన ప్ర‌తినిధుల‌తో పాటు.. పారిశ్రామిక వేత్త‌లు, ప్ర‌భుత్వ అధికారులు, మంత్రుల ను వ‌రుసగా చంద్ర‌బాబు క‌లుస్తూనే ఉన్నారు. ఏపీలో ఉన్న అవ‌కాశాలు.. ఇత‌ర‌త్రా అంశాల‌ను కూడా ఆయ న వారికి వివ‌రించారు.

తాజాగా బుధ‌వారం కూడా పెట్టుబ‌డుల వేట‌లో చంద్ర‌బాబు బిజీబిజీగా గ‌డిపారు. కేవ‌లం రెండు మూడు గంట‌ల్లోనే కీల‌క వ్యాపార దిగ్గ‌జాల‌తో భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో భార‌త్‌కు చెందిన‌, సింగ‌పూర్‌లో స్థిర‌పడిన‌ కెపిటాల్యాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ‌కు చెందిన‌ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. అదేవిధంగా మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌, టెమ్‌సెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతోనూ చంద్ర‌బాబు చ‌ర్చించారు. ఏపీలో ఉన్న అవ‌కాశాల‌ను వారికి వివ‌రించారు. ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హ‌క‌రిస్తుంద‌ని తెలిపారు.

పెట్టుబ‌డులు పెట్టి.. కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని చంద్ర‌బాబు కోరారు. దీనికి కేపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ‌ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరిశంకర్ నాగభూషణం ఓకే చెప్పారు. అంతేకాదు.. సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌-2047ను వారు కొనియాడారు. త‌ప్ప‌కుండా ఏపీలో పెట్టుబ‌డులు పెడ‌తామన్నారు. ప్ర‌భుత్వం అందిస్తున్న అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటామ‌న్నారు. చంద్ర‌బాబు కూడా వారిని అభినందించారు. ఒక్క ప్ర‌జెంటేష‌న్‌తోనే వారు ఏపీ పై సానుకూల‌త చూప‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు.

ఏయే రంగాల్లో పెట్టుబ‌డులు?

+ ఐటీ పార్కులు.
+ వర్క్ స్టేషన్ల ఏర్పాటు.
+ వైల్డ్ లైఫ్ పార్కులు.
+ ఎకో టూరిజం.
+ బయో డైవర్సిటీ కాంప్లెక్స్‌లు.
+ వైల్డ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్ల ఏర్పాటు.
+ మౌలిక వసతుల క‌ల్ప‌న‌.
+ గ్రీన్ ఎనర్జీ.
+ ఫైనాన్స్, ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్.
+ క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్.