మాధవ్ రాజకీయం.. బీజేపీకి ఆ వర్గాలు దూరం..!

బీజేపీ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్ వ్య‌వ‌హార శైలి కాపురానికి వచ్చిన కొత్తలోనే అన్న సామెతను గుర్తు చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. గతంలో పనిచేసిన ఇద్దరు కీలక నాయకులు అంద‌రినీ కలుపుకొని పోయారు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా, సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.

వాస్తవానికి ఆర్‌ఎస్ఎస్‌, బీజేపీతో పెద్దగా సంబంధం లేదని ద‌గ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలకు పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది. దీంతో వారు కొందరికే పరిమితం అయ్యారన్న వాదన ఉంది. ఇది ఎన్నికల్లోనూ ప్రభావం చూపించింది. అలాగే, వ్యక్తిగతంగా కూడా వారిపై ప్రభావం పడేలా చేసింది. అయినా కూడా వారిపై పెద్దగా వ్యతిరేకత రాలేదు.

కానీ తాజాగా, పీవీఎన్ మాధవ్ మాత్రం ఆర్‌ఎస్ఎస్ మూలాలు ఉన్న వారినే తనను కలిసేందుకు అవకాశం ఇస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాదు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పెద్దగా పట్టించుకోవడం లేదని, తనను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని అంటున్నారు.

నిజానికి మాధవ్ రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టి పది రోజులు మాత్రమే అయ్యింది. మరి ఇంతలోనే అంత విమర్శలు వస్తాయా? అంటే వస్తున్నాయి. మాధవ్‌ను కలుసుకునేందుకు చాలా మంది కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎంపిక చేసుకున్న వారికే ఆయన దర్శనం లభిస్తున్నదన్న టాక్ వినిపిస్తోంది.

ఇక బీజేపీ నాయకుల్లోనూ కొందరికి మాత్రమే ఆయన చేరువ అవుతున్నారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, కడప జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల‌ని నిర్ణయించుకున్న మాధవ్, కేవలం మోదీకి మాత్రమే ఈ క్రెడిట్ ఇచ్చేలా చేస్తున్నారు.

అంటే కేంద్రంలోని మోదీ సర్కారుకు మాత్రమే తన ప్రచారం పరిమితం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడా కూడా రాష్ట్రంలోని కూటమి సర్కారు తరఫున ఆయన వాయిస్ వినిపించే వ్యూహం కానీ, ప్రయత్నం కానీ చేయడం లేదు. ఇది కూడా బీజేపీలోని ఓ వర్గం నాయకులకు నచ్చడం లేదు.

దీంతో మాధవ్‌పై అప్పుడే కొందరు పెదవి విరుస్తున్నారు. “మేము ఆర్‌ఎస్ఎస్‌ నుంచి రాలేదు. అంత మాత్రాన బీజేపీ నాయకులం కాదా?” అని ఓ కీలక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈయన టీడీపీ నుంచి బీజేపీలోకి చేరి టికెట్ తెచ్చుకుని విజయం దక్కించుకున్నారు. ఇలా చాలా మంది నాయకులు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుండటం గమనార్హం.