ఢిల్లీకి జ‌గ‌న్‌.. ఎందుకు?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఢిల్లీకి వెళ్తున్నారా? కేంద్రంలోని పెద్ద‌ల‌తో ఆయ‌న భేటీ అవుతున్నారా? అంటే.. జ‌గ‌న్ నివాసం తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఆదివారం, లేదా సోమ‌వారంలో జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్తున్నార‌ని అంటున్నారు. బీజేపీ పెద్ద‌ల‌ను ఆయ‌న క‌లుసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటు న్నారు. అదేవిధంగా ఇండియా కూట‌మి పార్టీల నాయ‌కుల‌తోనూ జ‌గ‌న్ భేటీ కానున్న‌ట్టు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా త‌న‌కు మద్ద‌తుగా నిల‌వాల‌ని వారిని కోరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం మ‌ద్యం కుంభ‌కోణం కేసు విచార‌ణ ఊపందుకుంది. ఈ క్ర‌మంలో కీల‌క నాయ‌కులు, ఈ కేసులో నిందితులుగా ఉన్న‌వారిని సిట్ అధికారులు అరెస్టు చేస్తున్నారు. కీల‌క‌మైన నాయ‌కుడు.. ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్టు అయ్యారు. ఈ నేప‌థ్యంలో అన్ని వేళ్లు ఇప్పుడు జ‌గ‌న్ వైపు చూపిస్తున్నాయి. దీంతో ఆయ‌న అరెస్టు కూడా ఖాయ‌మ‌న్న ప్రచారం జ‌రుగుతోంది. ఈ విషయం జ‌గ‌న్‌కు కూడా తెలుసు. ఆయ‌న కూడా రెడీగానే ఉన్నారు. తానేమీ పారిపోలేద‌న్నారు. వ‌చ్చి అరెస్టు చేసుకోవాల‌న్నారు.

అయితే… ఈ అరెస్టు విష‌యంలోనే జ‌గ‌న్ మాస్ట‌ర్ మైండ్‌తో ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంటే.. త న అరెస్టుఎలానూ ఖాయ‌మైన‌ప్పుడు.. దానిని రాజ‌కీయంగా వాడుకోవాల‌న్న‌ది నాయ‌కుల వ్యూహం. గ‌తం లో ఢిల్లీ ముఖ్య‌మంత్రి గా ఉన్న‌ కేజ్రీవాల్ ను మ‌ద్యం కుంభ‌కోణంలోనే అరెస్టు చేసిన‌ప్పుడు.. ఆయ‌న ఆ ప‌ద‌విని వ‌దులు కోకుండా.. చాలా నెల‌ల పాటు జైలు నుంచే పాల‌న సాగించారు. అంటే.. ఆయ‌న రాజ‌కీయ మైలేజీ కోరుకున్నార‌న్న‌ది సుస్ప‌ష్టం. ఇక‌, తాజా కేసులో జ‌గ‌న్ కూడా అలానే వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.

అంటే.. త‌న‌ను అరెస్టు చేసే పరిస్థితే వ‌స్తే.. అది సంచ‌ల‌నంగా ఉండాల‌ని.. రాజకీయంగా టీడీపీ కూట‌మికి మైన‌స్‌.. త‌న‌కు, త‌న పార్టీకి ప్ల‌స్ కావాల‌న్న వ్యూహం ఉంద‌ని తెలుస్తోంది. అందుకే.. కేంద్రంలోని పెద్దల ను.. బీజేపీ. ఇండియా కూట‌మి నాయ‌కుల‌ను క‌లుసుకోవ‌డం ద్వారా.. త‌న‌పై కూట‌మి స‌ర్కారు కుట్ర ప‌న్నుతోంద‌న్న వాద‌న‌ను బ‌లంగా వినిపించాల‌న్న‌ది జ‌గ‌న్ భావ‌న‌. త‌ద్వారా.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయాల‌న్న వ్యూహంతోనే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.