సై..! రండి తేల్చుకుందాం: రేవంత్‌-ర‌మేష్‌ల‌కు కేటీఆర్ స‌వాల్‌

బీజేపీ నాయ‌కుడు, ఏపీలోని అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేష్ త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తాను చేసిన ఆరోప‌ణ‌ల‌పై నిల‌బ‌డ‌తాన‌ని.. అవి ఆరోప‌ణ‌లు కాదు.. ప‌క్కా వాస్త‌వాల‌ని పేర్కొన్నారు. వీటిపై చ‌ర్చించేందుకు తాను సిద్ధ‌మేన‌న్నారు. “మీకు నిజంగానే తెలుసుకోవాల‌ని ఉంటే.. రండి.. ఒక్కరే కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి, సీఎం ర‌మేష్‌లు ఇద్ద‌రూ క‌లిసి రండి. చ‌ర్చిద్దాం.” అని కేటీఆర్ స‌వాల్ రువ్వారు. తెలంగాణ‌ను అడ్డు పెట్టుకుని దోచుకునేందుకు ప్ర‌య‌త్నించిన రేవంత్ రెడ్డికి.. ర‌మేష్ స‌హ‌క‌రించార‌ని మ‌రోసారి ఆయ‌న ఆరోపించారు.

ఈ దోపిడీకి స‌హ‌క‌రించినందుకే.. ర‌మేష్‌కు రూ.1660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు ప‌నుల‌ను అప్ప‌నంగా అప్ప‌గించార‌ని కేటీఆర్ దుయ్యబ‌ట్టారు. అస‌లు ఫ్యూచ‌ర్ సిటీనే లేన‌ప్పుడు అక్క‌డ రోడ్డు వేసేందుకు కాంట్రాక్టు ఎలా ఇచ్చారో అర్ధం కావ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. అదేవిధంగా హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల విష‌యంలోనూ 10 వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని.. ఈ విష‌యాన్నే తాను ప్ర‌స్తావించాన‌న్నారు. ఈ రెండు అంశాల‌పైనా చ‌ర్చ‌కు రెడీ కావాల‌ని.. తాను ఎక్క‌డికి ర‌మ్మంటే అక్క‌డ‌కు వ‌స్తాన‌ని కేటీఆర్ తేల్చి చెప్పారు. లుచ్చా ప‌నులు చేయ‌డం.. అల‌వాటుగా మారిందని, ప్ర‌శ్నిస్తే.. ఎదురు దాడి చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఇక‌, బీఆర్ ఎస్ విలీనంపై సీఎంర‌మేష్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా కేటీఆర్ తిప్పి కొట్టారు. “బీఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు ఇబ్బందుల్లో ప‌డినా.. కాంగ్రెస్‌, బీజేపీలు.. ప‌నికిమాలిన‌, ప‌స‌లేని.. విల‌న ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెస్తున్నాయి. అస‌లు తెలంగాణ కోసం.. ఇక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు.. తెలంగాణ అస్తిత్వాన్ని నిల‌బెట్టేందుకు పుట్టిన పార్టీగా బీఆర్ ఎస్‌కు విలీనం కావాల్సిన అవ‌స‌రం కానీ.. ఆ అగ‌త్యం కానీ లేవు. కానీ.. మాకు ఇబ్బందులు వ‌చ్చిన ప్ర‌తిసారీ.. విలీనం.. విలీనం.. అంటూ ప‌నికిమాలిన రాజ‌కీయాలు చేస్తున్నారు.” అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీఆర్ ఎస్ ఇప్పుడే కాదు.. ఎప్ప‌టికీ.. ఇత‌ర పార్టీల్లో చేరే ప్ర‌స‌క్తే లేద‌ని.. విలీనం అంత‌క‌న్నా లేద‌ని తేల్చి చెప్పారు.

ఏంటి వివాదం?

ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం ర‌మేష్‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో చేతులు క‌లిపి.. రుణాలు ఇప్పించార‌ని.. దీనికి ప్ర‌తిఫ‌లంగా రేవంత్ రెడ్డి 1660 కోట్ల రూపాయ‌ల విలువైన కాంట్రాక్టును ఎలాంటి టెండ‌ర్లులేకుండానే అప్ప‌నంగా ర‌మేష్ సంస్థ‌కు క‌ట్ట‌బెట్టార‌ని.. కేటీఆర్ కొన్ని రోజుల కింద‌ట సోష‌ల్ మీడియాలో వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం ర‌మేష్ శ‌నివారం సాయంత్రం స్పందించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల్లో ప‌స‌లేద‌న్నారు. అస‌లు అంత పెద్ద కాంట్రాక్టును నామినేష‌న్ విధానంలో ఎలా అప్ప‌గిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలోనే క‌విత జైల్లో ఉన్న‌ప్పుడు.. త‌న ఇంటికి వ‌చ్చిన కేటీఆర్‌.. బీఆర్ ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామ‌ని.. కేసుల నుంచి త‌మ‌ను బ‌య‌ట‌ప‌డేయాల‌ని ప్రాథేయ ప‌డ్డార‌ని చెప్పారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ త‌న‌వ‌ద్ద ఉంద‌న్నారు. దీనిపైనే కేటీఆర్ స‌వాల్ రువ్వారు.