న‌న్ను అన‌వ‌స‌రంగా కెలికిన కేటీఆర్‌: సీఎం ర‌మేష్‌

బీజేపీ నాయ‌కుడు, ఏపీలోని అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు స‌భ్యుడు సీఎం ర‌మేష్‌.. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “న‌న్ను అన‌వ‌స‌రంగా కేటీఆర్ కెలుకుతున్నాడు..” అని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో చేతులు క‌లిపి తాను కాంట్రాక్టులు కొట్టేస్తున్నాన‌ని.. కంచ గ‌చ్చిబౌలి భూముల త‌న‌ఖా వెనుక‌.. త‌ను ఉన్నాన‌ని కేటీఆర్ ఆరోపించార‌ని.. చెప్పారు. అదేస‌మ‌యంలో తాను సాయం చేసినందుకుగాను ‘ఫ్యూచ‌ర్ సిటీ’ ప‌నుల్లో కాంట్రాక్టు కూడా త‌న‌కు ఇచ్చార‌ని కేటీఆర్ చెప్పిన‌ట్టు తెలిపారు. అయితే.. ఇవ‌న్నీ అర్ధం లేని, నిరాధార ఆరోప‌ణ‌లుగా సీఎం ర‌మేష్ పేర్కొన్నారు.

“న‌న్ను అన‌వ‌స‌రంగా కెలుకుతున్నావ్!” అంటూ.. కేటీఆర్‌పై ర‌మేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఫ్యూచ‌ర్ సిటీలో రూల్స్‌కు అనుగుణంగానే త‌న‌కు కాంట్రాక్టులు ఇచ్చార‌ని.. అంత‌కుమించి.. నామినేష‌న్ విధానంలో త‌న‌కు కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్ట‌లేద‌న్నారు. ఎక్క‌డైనా 1660 కోట్ల రూపాయ‌ల విలువైన ప‌నుల‌ను నామినేష‌న్ విధానంలో క‌ట్ట‌బెడుతారా? అని ప్ర‌శ్నించారు. ఇది కేటీఆర్ మూర్ఖ‌త్వానికి నిద‌ర్శ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌దేళ్లు త‌న తండ్రి ద‌గ్గ‌ర మంత్రిగా ప‌నిచేసిన కేటీఆర్‌కు ఈ చిన్న విష‌యం కూడా తెలియ‌దా? అని సీఎం ర‌మేష్‌ ప్ర‌శ్నించారు.

“ఫ్యూచర్ సిటీలో వేసిన టెండర్లకు అన్ని రూల్స్ ప్రకారం.. రుత్విక్ కంపెనీకి టెండర్ ఇచ్చారు. పదేళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్‌కు నామినేషన్ పద్ధతిలో 1660 కోట్ల కాంట్రాక్టు పనులు ఇస్తారా? ఇవ్వరా? అనే విష‌యం తెలియ‌దా?” అని ప్ర‌శ్నించారు. ఎక్క‌డ ఏ ప్ర‌భుత్వం ఉన్నా.. 5 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ చేసే కాంట్రాక్టును నామినేష‌న్ ప‌ద్ధ‌తిలో కేటాయించేందుకు అవ‌కాశం ఉందన్నారు. తాను ఎల్ అండ్ టీతో క‌లిసి పనులు చేస్తున్నాన‌ని.. ఇది మూడు మాసాలు అయిపోయింద‌న్నారు. ఇప్పుడు ఆ విష‌యాలు తెచ్చి.. ఏం చేయాల‌ని అనుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా గ‌తంలో జ‌రిగిన ఘ‌టన‌ను కూడా సీఎం ర‌మేష్ చెప్పుకొచ్చారు. కేటీఆర్ చెల్లెలు క‌విత మ‌ద్యం కుంభ‌కోణంలో చిక్కుకుని జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ త‌న ఇంటికి వ‌చ్చాడ‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో త‌న చెల్లిని జైలు నుంచి విడుదలయ్యేలా చూడాల‌ని ప్రాధేయప‌డ్డార‌ని వ్యాఖ్యానించారు. ఏపీలో జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు ఉన్న‌ట్టుగానే కేటీఆర్‌కు క‌విత‌తో పంచాయ‌తీ ఉంద‌న్నారు. కవిత జైళ్లో ఉన్న సమయంలో ఢిల్లీలోని తన ఇంటికి కేటీఆర్ వచ్చారన్న సీఎం ర‌మేష్‌.. కవితను బ‌య‌ట‌కు వదిలేస్తే బీజేపీతో పొత్తు, విలీనం చేస్తామని ప్రతిపాదించార‌ని సీఎం రమేష్ చెప్పారు. త‌న‌ను కెల‌కొద్ద‌ని హెచ్చ‌రించారు.