చంద్ర‌బాబు మ‌రో క‌ల‌ల ప్రాజెక్టు.. హైడ్రోజ‌న్ వ్యాలీ

క‌ల‌లు క‌నండి.. వాటిని సాధించుకునేందుకు కృషి చేయండి.. అన్నారు దివంగ‌త రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం. ఈ కోవ‌లేకే వ‌స్తారు సీఎం చంద్ర‌బాబు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న వినూత్న స్వప్నాల‌ను కంటారు. వాటిని అక్క‌డితో వ‌దిలేయ‌రు. సాకారం చేసుకు నేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఇలా మెద‌లైన‌వే.. ఉమ్మ‌డి ఏపీలో ఐటీ, సైబ‌రాబాద్ వంటివి. ఆ త‌ర్వాత‌.. విభ‌జిత ఏపీలోనూ చంద్ర‌బాబు క‌ల‌లు క‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిని ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌ని అనుకున్నారు. కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా క్వాంటమ్ వ్యాలీ అంటూ.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నాటికి దానిని సాధించేందుకు ప్లాన్ చేసుకున్నారు.

ఇక్క‌డితో కూడా చంద్ర‌బాబు ఆగ‌లేదు. ‘హైడ్రోజ‌న్ వ్యాలీ’ అంటూ మ‌రో స్ప‌న్నాన్ని తెర‌మీదికి తెచ్చారు. దీనిని 2030 నాటికి సాకారం చేయాల‌ని నిర్ణ‌యించారు. అప్ప‌టిక‌ల్లా రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా రూపుదిద్దుకునేలా చేయాల‌న్న‌ది చంద్రబాబు ప్లాన్‌. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దడం ద్వారా భ‌విష్య‌త్తు ఇంధ‌న అవ‌స‌రాల‌కు ఏపీని గ‌మ్య‌స్థానంగా చేయాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. ఈ క్ర‌మంలోనే ‘గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల’ను స్థాపించేందుకు చంద్ర‌బాబు ప్రైవేటు సంస్థ‌ల‌కు రెడ్ కార్పెట్ ప‌రుస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వంతో నాలుగు కంపెనీలు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ప్ర‌స్తుతం మ‌నం వినియోగిస్తున్న పెట్రోల్‌, డీజిల్ ద్వారా క‌ర్బ‌న ఉద్గారాలు పెరిగి వాతావ‌ర‌ణ మార్పుల‌కు కార‌ణం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వీటిని 2030 నాటికి జీరో స్థాయికి తీసుకురానున్నారు. ఈక్ర‌మంలో విద్యుత్‌ను ఎక్కువ‌గా వినియోగంలోకి తీసుకువ‌స్తున్నారు. విద్యుత్ వాహ‌నాలు ఈ ప‌రంప‌ర‌లోవే. అయితే.. అన్నీ విద్యుత్ అయిపోతే.. అప్పుడు దానికి కూడా కొర‌త వ‌స్తుంది క‌దా?! అనేద ప్ర‌శ్న‌. దీనికి జ‌వాబే.. ‘గ్రీన్ హైడ్రోజన్’. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా దీనిపై అవ‌గాహ‌న పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే కొన్ని సంవ‌త్స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని ఏపీని గ్రీన్ హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తికి హ‌బ్‌గా తీర్చిదిద్దాల‌ని సీఎం చంద్ర‌బాబు యోచిస్తున్నారు.

ఏం జ‌రుగుతుంది?

  • రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచితే.. దేశంలోనే అతి పెద్ద ఎకోసిస్టమ్ కు ఏపీ కేంద్రంగా మారుతుంది.
  • 2027నాటికి 2 గిగావాట్లను, 2029 నాటికి 5 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయ‌డం ద్వారా ఏపీ అవ‌స‌రాల‌కు ఇబ్బంది ఉండ‌దు.
  • 2030 నాటికి యేటా 15 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేపట్టనున్నారు. త‌ద్వారా ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా విక్ర‌యించే అవ‌కాశం ఉంటుంది.
  • అంతేకాదు.. కిలో హైడ్రోజన్ రూ.460 నుంచి 160 కి ఉత్ప‌త్తి అయ్యేలా ప‌రిశోధ‌న‌లు చేయ‌నున్నారు.
  • గ్రీన్ ఎనర్జీ కారిడార్గా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర దాకా విద్యుత్ అవ‌స‌రాలు నెర‌వేర‌నున్నాయి.