వైసీపీ హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రస్తుత ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమం లో ప్రత్యక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది. తాజాగా 300 పేజీలతో కూడిన ప్రాథమిక చార్జిషీట్ను సిట్ అదికారులు కోర్టుకు సమ ర్పించారు. అయితే..చిత్రం ఏంటంటే.. గత నాలుగు రోజులుగా మీడియాలో హల్చల్ చేస్తున్న వైసీపీ ఎంపీ, ఈ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి పాత్ర ఏంటి? అన్నది మాత్రం సిట్ అధికారులు ఈ చార్జిషీట్లో స్పష్టం చేయకపోవడం గమనార్హం. అయితే.. ఆయన పేరును మాత్రం పేర్కొన్నారు. అంతకుమించి ఆయన ఏం చేశారన్నది గోప్యంగా ఉంచారు.
ఇక, ఈ తాజా చార్జిషీట్లో 104 పోరెన్సిక్ నివేదికలు, 130కు పైగా ఎలక్ట్రానిక్ డివైజ్లను(వీటిలో ల్యాప్టాప్లు, పోన్లు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవులు ఉన్నాయి) కూడా కోర్టుకు సమర్పించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సిట్ అధికారులు ఇప్పటి వరకు 268 మంది సాక్షులను విచారించామని.. 11 మంది నుంచి నేరుగా వాంగ్మూలాలను సేకరించామని పేర్కొన్నారు. అదేవిధంగా 40 మందిని నిందితులుగా గుర్తించామని తెలిపారు. వీరిలో 11 మందిప్రస్తుతం జైళ్లలో ఉన్నట్టు కూడా వివరించారు. వాటికి సంబంధించిన అన్ని వివరాలను కూడా కోర్టుకు సమర్పించారు.
అలాగే.. వివిధ బ్యాంకులు, ఆస్పత్రులు, బంగారం షాపులు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో నిందితులు పెట్టిన పెట్టుబడులు, వారి వ్యాపాలు ఎలా పెరిగాయి.. అనే వివరాలను కూడా సమగ్రంగా సిట్ అదికారులు వివరించారు. ఈ కుంభకోణం దేశంలోనే కాకుండా.. విదేశాలకు కూడా పాకినట్టు పేర్కొన్నారు. వాటిపై ఇంకా విచారణ జరుగతోందని.. మరో రెండు లేదా మూడు వారాల్లో మరో చార్జిషీట్లో ఆయా వివరాలను పొందు పరచనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం విచారణ కీలక దశలో ఉన్నందున ఇతర వివరాలను కూడా గోప్యంగా ఉంచుతున్నట్టు అధికారులు వివరించారు.
మిథున్ రెడ్డి పరిస్థితి ఇదీ..
ఇక, శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచివిజయవాడకు చేరుకున్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అదికారులు విచారిం చారు. సాయంత్రం పొద్దు పోయేవరకు ఈ విచారణ జరిగింది. అయితే.. ఆయనను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ.. అధికారులు దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే.. శనివారం రాత్రికి విజయవాడలోనే ఉంచి.. ఆదివారం కూడా మరోసారి విచారించనున్నట్టు అధికారులు మీడియాకు చెప్పారు. దీనిని బట్టి ఆదివారం ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates