సిఎం పదవిని ఇచ్చి నితీష్ ను బీజేపీ బిగించేసిందా ?

బీహార్ రాజకీయాల్లో కొత్త తరహా రాజకీయం మొదలైంది. సంకీర్ణ ప్రభుత్వం పేరుతో, మిత్రధర్మం పేరుతో బీజేపీ నేతలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పూర్తిగా ఇరికించేసినట్లు అర్ధమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయుకి 43 సీట్లు, బీజేపీకి 73 సీట్లు వచ్చాయి. ఎన్డీయే కూటమిలోని మరో రెండు చిన్న పార్టీలకు కూడా కొన్ని సీట్లొచ్చాయి లేండి. ఇంత తక్కువ సీట్లలో గెలిచిన జేడీయు అధినేత నితీష్ నే కూటమి ముఖ్యమంత్రిని చేస్తుందా అనే అనుమానాలు మొదలైపోయాయి. అయితే మిత్రధర్మమం అని చెప్పి బీజేపీ నితీష్ కే పగ్గాలు అప్పగించింది.

ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు కథంతా ఇక్కడే మొదలైంది. ఎలాగంటే 73 సీట్లు గెలుచుకున్న బీజేపీని కాదని 43 సీట్లలో గెలిచిన జేడీయు అధినేత నితీష్ నే సిఎం చేయటం ఏమిటంటూ బీజేపీలో గోల మొదలైంది. అయితే అంతర్గతంగా ఏమి జరిగిందో ఏమో కానీ నితీష్ కు వ్యతిరేకంగా లేచిన గొంతులు అంతలోనే అణిగిపోయాయి. సరే ముందు అనుకున్నట్లుగానే బీజేపీ నితీష్ కే పట్టంకట్టినా పగ్గాలంతా తన చేతిలోనే పెట్టుకున్నట్లు కనబడుతోంది.

తాజాగా ఏర్పడిన మంత్రివర్గాన్ని గమనిస్తే విషయం ఇట్టే అర్ధమైపోతుంది. ఇద్దరు ఉపముఖ్యమంత్రులు బీజేపీ ఎంఎల్ఏలే. స్పీకర్ కూడా బీజేపీ ఎంఎల్ఏనే. మంత్రిత్వ శాఖల్లో కీలకమైనవన్నీ బీజేపీ తన చేతిలోనే పెట్టుకుంది. అంటే డ్రైవింగ్గ సీట్లో కూర్చున్నది నితీషే అయినా స్టీరింగ్ మీద చేతులు మాత్రం బీజేపీదే అనే విషయం అర్ధమైపోతోంది. నిజానికి నితీష్ కు ఇది చేదు అనుభవమనే చెప్పాలి. ఎందుకంటే 15 ఏళ్ళుగా బీహార్ కు అవిచ్ఛినంగా పాలిస్తున్న నితీష్ కు ఇటువంటి అనుభవం మొదలసారనే చెప్పాలి.

మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు అసెంబ్లీలో జేడీయూ ఎంఎల్ఏలదే పై చేయిగా ఉండేది. అంటే ఎవరితో పొత్తులు పెట్టుకున్నా గెలిచిన ఎంఎల్ఏల్లో ఎక్కువమంది జేడీయు వాళ్ళే ఉండేవారు. కాబట్టి మంత్రివర్గకూర్పులో గానీ, శాఖల కేటాయింపులో కానీ, స్పీకర్ లాంటి ఇంపార్టెంట్ పదవిలో కానీ జేడీయు వాళ్ళదే పైచేయిగా ఉండేది. కానీ ఇప్పటి ప్రభుత్వంలో జేడీయు ఎంఎల్ఏల సంఖ్య తక్కువ. ఏమన్నా అంటే నితీష్ ను సిఎంను చేసిందే చాలా ఎక్కువని బీజేపీ నేతలంటున్నారు.

దాంతో తాజాగా ఏర్పాటైన మంత్రివర్గంతో నెట్టుకురాక నితీష్ కు వేరేదారి లేదు. మిత్రపక్షంలో తనది మైనర్ షేర్ కావటంతో నితీష్ కూడా చేసేదేమీ లేదని తేలిపోయింది. సీఎం కుర్చీలో కూర్చోవాలంటే బీజేపీ చెప్పినట్లు వినాల్సిందే వేరే దారిలేదు. ఈ కారణంతోనే సీఎం పదవిలో నితీష్ ను కూర్చోబెట్టిన బీజేపీ పగ్గాలు మొత్తం తన చేతిలోకి తీసేసుకుందనే చెప్పాలి. ఎంతకాలం ఇలా సాగుతుందో చూడాల్సిందే.