ప్రజలకు చేరువయ్యేందుకు.. చాలా మార్గాలే ఉన్నాయి. వారి కష్టాలు తెలుసుకోవచ్చు. వారి తరఫున గళం వినిపించవచ్చు. ప్రభుత్వంపై పోరాటం చేయొచ్చు. నిరంతరం ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించ డం ద్వారా కూడాప్రజలకు చేరువ కావొచ్చు. కానీ.. వైసీపీ మాస్ పాలిటిక్స్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుల నుంచి జూనియర్ల వరకు కూడా.. మాస్ ఎలివేషన్ కోరుకుంటున్నారు. అయితే.. ఇది వైసీపీకి ఏమేరకు మేలు చేస్తుందన్నది ప్రశ్న.
ప్రజల్లో మాస్ పాలిటిక్స్ను కోరుకునేవారు.. 10 శాతంలోపే ఉంటారు. కొడతాం.. నరుకుతాం.. అంటే.. ఎవరు మాత్రం ముందుకు వస్తారు? ఏదో పెడతాం.. అంటే.. ఓటేస్తారు కానీ.. అనే మాట ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దీనికి కారణం.. ఇద్దరు మాజీ మంత్రులు వరుసగా చేసిన కామెంట్లు. వారిద్దరికి తమ తమ నియోజకవర్గాలలో అంతో ఇంతో క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ, జగన్ మాయలో పడుతున్నారో.. లేక వారి పార్టీ విధానమే అంత అనుకుంటున్నారో తెలియదు కానీ… మాస్లో పడికొట్టుకుంటు న్నారు.
మాజీ మంత్రులు.. పేర్ని నాని, ఆదిమూల సురేష్లు ఇద్దరూ కూడా.. వరుస పెట్టి చేసిన వ్యాఖ్యలు వైసీపీని మరింత బద్నాం చేశాయి. రప్పా-రప్పా అని చెప్పడం కాదు.. చేసేయడమే! అని తనదైన శైలిలో పేర్ని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక, దీనికి కొనసాగింపా అన్నట్టుగా.. మాజీ మంత్రి, మాజీ ప్రభుత్వ ఉన్నతోద్యోగి కూడా అయిన.. ఆదిమూలపు సురేష్.. కూడా.. ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.
“ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి రప్పా రప్పా.. మరో లెక్క!” అంటూ.. ఆదిమూలపు కూడా బరితెగింపు వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇలా.. మాస్ పాలిటిక్స్ చేసుకుంటూ.. పోతే.. రేపు పార్టీని మూసేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అప్పుడు.. వైసీపీలోనే రప్పా రప్పా.. చేసుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఉన్న మార్గాలను వదిలేసి.. రప్పా రప్పా.. డైలాగులతో కాలం వెళ్లదీయడాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates