ఇక‌, ‘గంటా’ వంతు.. కూట‌మిపై రుస‌రుస‌లు!

కూట‌మి ప్ర‌భుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న‌వారు.. కీల‌క ప‌ద‌వులు అనుభ‌వించిన అనుభ‌వం ఉన్న‌వారు.. త‌మ అసంతృప్తిని, ఆవేద‌న‌ను వెలిబుచ్చుతున్నారు. అయితే.. దీనిని ప‌నిరూపంలో చేసి.. చంద్ర‌బాబు ను మెప్పించే విధంగా వ్య‌వ‌హ‌రిస్తే.. బాగుంటుంది. కానీ.. నోటికి ప‌నిచెబుతూ.. ప్ర‌భుత్వాన్ని ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ.. చుల‌క‌న వ్యాఖ్య‌ల‌తో ప‌రువు తీస్తున్నారు. ఇటీవ‌ల.. జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూట‌మి ప్ర‌భుత్వంపైనా.. కూట‌మిపైనా విమ‌ర్శ‌లు చేశారు.

ఇక‌, తాజాగా ఈ జాబితాలో మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత‌, విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు.. స‌ర్కారుపై ప‌రోక్ష విమ‌ర్శ‌లు గుప్పించారు. “గోడ కడితే పడిపోద్ది.. షెడ్ వేస్తే కూలిపోద్ది.. ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టానుసారంగా బదిలీలు చేస్తున్నారు. సింహాచ‌లం(ఆల‌యం) ఇంత అస్తవ్యస్తం కావ‌డం ఎప్పుడూ చూడలేదు. ప్రజలకు అసలు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు!?” అని గంటా శ్రీనివాసరావు బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

గ‌త నెల‌లో జ‌రిగిన అప్ప‌న్న చందనోత్సవంలో గోడ కూలిపోయి అమాయకులైన ఏడుగురు భక్తులు మరణించిన సంఘటనను అంద‌రూ మ‌రిచిపోయినా.. గంటా వారు గుర్తు పెట్టుకున్న‌ట్టుగా ఉన్నారు. దీంతో ఆ విష‌యాన్ని ఎవరూ మర్చిపోలేదు అంటూ కామెంట్లు చేశారు. తాజాగా షెడ్ నిర్మాణం కుప్ప‌కూలింది. కానీ, ఎవ‌రికీ ఏమీ కాలేదు. అయినా.. దీనిని హైలెట్ చేస్తూ.. మ‌న‌సులో ఉన్న అసంతృప్తిని ఆయ‌న బ‌య‌ట పెట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

“ఎంతో నమ్మకంతో గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు మనం ఏరకమైన భరోసా ఇస్తున్నాం.” అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. సింహాచలం దేవస్థానం ఇమేజ్ మసకబారిపోతోందని, ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే.. సింహాచ‌లాన్ని అడ్డు పెట్టి గంటా త‌న మ‌న‌సులో ఉన్న ఆవేద‌న‌ను, ఆక్రోశాన్ని వెళ్ల‌గ‌క్కార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మంత్రి వ‌ర్గంలో చోటు ల‌భించ‌క‌పోవ‌డం.. కాపు నాయ‌కుల్లో త‌న‌కు ఉన్న ఇమేజ్ కూడా త‌గ్గుతుండ‌డంతో గంటా వారు ఇలా వ్యాఖ్యానించార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కానీ.. సీనియ‌ర్ నాయ‌కుడిగా త‌ప్పులు స‌రిచేసే ప్ర‌య‌త్నం చేయాలి త‌ప్ప‌.. ఇలా త‌ప్పులు ఎత్తి చూపే ప‌ద్ధ‌తి స‌రికాద‌ని అంటున్నారు.