‘ఇండోసోల్’ ఎవ‌రి కోసం..ఈ ఆరాటం ఎందుకోసం!

ప్ర‌స్తుతం ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని క‌రేడు గ్రామంలో ప్ర‌భుత్వం భూముల సేక‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నించ‌డం.. దీనిని రైతులు ఎదిరించ‌డం.. వ్య‌తిరేకించ‌డం.. హెచ్చ‌రిక‌లు చేయ‌డం తెలిసిందే. ఏకంగా 4,500 ఎక‌రాల భూమిని తీసుకోవాల‌న్న‌ది కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం 2 వేల ఎక‌రాల‌కు మాత్ర‌మే నోటిఫికేష‌న్ ఇచ్చింది. దీనిని సేక‌ర‌ణ విధానంలోనే చేప‌డుతున్నారు. అయితే.. ఇలా రైతులు ఎందుకు తిర‌గ‌బ‌డుతున్నారు? అస‌లు దీని క‌థేంటి? అనేది ఆస‌క్తిక‌రం.

క‌రేడు గ్రామంలో ఇండోసోల్ సంస్థ‌..(ఇది సోలార్ ఎన‌ర్జీ రంగంలో కీల‌క సంస్థ‌గా ఎదిగింది.) పెద్ద ప్రాజెక్టును ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. వాస్త‌వానికి ఇది వైసీపీ హ‌యాంలో జ‌రిగిన నిర్ణ‌యం. అప్ప‌ట్లోనే దీనికి ఒప్పందాలు చేసుకున్నారు. ఇండోసోల్ సంస్థ అధినేత విశ్వేశ్వ‌ర‌రెడ్డి అయితే.. ఈ కంపెనీ సీఈవో శ‌ర‌త్ చంద్రారెడ్డి(వైసీపీ మాజీ నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి సోద‌రుడు). ఈ ఒప్పందం అప్ప‌ట్లోనే చేసుకున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. దీనిని పెద్ద ఎత్తున వ్య‌తిరేకించింది.

అంతేకాదు.. అదానీతో సంబంధాలు ఉన్న ఇండోసోల్‌కు ప‌చ్చ‌ని భూములు ఎలా క‌ట్ట‌బెడుతున్నార‌ని కూడా నిల‌దీసింది. అనుకూల మీడియాలో పుంఖాను పుంఖాలుగా క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. ఇక‌, క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే కూట‌మి ప్ర‌భుత్వంలోని టీడీపీ.. అదే ఇండోసోల్‌కు అప్ప‌ట్లో జ‌రిగిన ఒప్పందం మేర‌కే 4500 ఎక‌రాల‌ను అప్ప‌గించేందుకు రెడీ అయింది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌కాదు. ఇదంతా.. జ‌గ‌మెరిగిన స‌త్యం.

అయితే.. ఇలా చేయ‌డం ద్వారా కూట‌మిపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ఏటా మూడు పంట‌లు (స‌జ్జ‌లు, రాగులు, మిర్చి) పండే ఈ భూముల‌ను ఇచ్చేది లేద‌ని అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. కూట‌మి మాత్రం ముందుకే సాగుతోంది. ఇదిలావుంటే.. అస‌లు ఎందుకిలా చేస్తున్నార‌న్న‌దానికి రెండు కార‌ణాలు ఉన్నాయి. 1) సాయిరెడ్డి సోద‌రుడు చేస్తున్న ఒత్తిడి. 2) మ‌న‌వాళ్లు కూడా దీనిలో ఉండ‌డం. వీటికి మించి మ‌రో కార‌ణం.. కూడా ఉంది. కానీ.. ఇది.. టీడీపీకి మైన‌స్ అవుతున్న విష‌యాన్ని గ్ర‌హించినా.. ముందుకు సాగ‌డం మ‌రింత చిత్రం!!. సో.. ఇండోసోల్ ఎవ‌రికీ వ్య‌తిరేకం కాదు. కాక‌పోతే.. రాజ‌కీయాలే ముసురుకున్నాయి. అంతే..!.