ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ మంత్రి.. రచ్చరచ్చ

ఈ స్టోరీలో ఎంపీగారేమో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. ఎమ్మెల్యే గారేమో నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. ఇక మాజీ మంత్రిగారేమో అదే జిల్లాకు చెందిన ఏరాసు ప్రతాప్ రెడ్డి. ఈ ముగ్గురూ ఇప్పుడు అధికార టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే శ్రీశైల నియోజకవర్గ పరిధిలోని పెద్ద పట్టణం ఆత్మకూరులో శుక్రవారం ఉన్నట్టుండి ఈ ముగ్గురి కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏరాసు ఇంటిపై బుడ్దా వర్గం ఏకంగా దాడికి దిగింది. పోలీసులు పరుగున రాకుంటే ఈ రచ్చ ఓ రేంజిలో ఉండేదే.

అసలేం జరిగిందన్న విషయానికి వస్తే… బైరెడ్డి శబరి ఎంపీ హోదాలో శుక్రవారం ఆత్మకూరు వెళ్లారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో బాగంగానే ఆమె అక్కడికి వెళ్లారట. అయితే ఈ సమాచారం స్థానిక ఎమ్మెల్యే అయిన బుడ్డాకు తెలియనే లేదట. సరే.. మహిళా నేత, యువ నేత, ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తున్నారులే అని బుడ్దా కూడా పెద్దగా పట్టించుకోలేదట. ఈ కార్యక్రమంతోనే సరిపెట్టని శబరి.. ఆత్మకూరులోని ఏరాసు ఇంటికి వెళ్లారట. ఏరాసు ఆహ్వానిస్తేనే ఆమె ఆయన ఇంటికి వెళ్లారట. ఈ విషయం విన్నంతనే బుడ్డా వర్గం అగ్గి మీద గుగ్గిలమైంది.

అప్పటికే ఏరాసు ఇంటి సమీపంలోకి వందల సంఖ్యలో బుడ్డా అనుచరులు చేరుకున్నారు. ఏరాసుతో భేటీనో, పలకరింపో తెలియదు గానీ… అక్కడ పని ముగియగానే శబరి అక్కడి నుంచి వెళ్లిపోయారట. శబరి అలా వెళ్లగానే.. ఇలా బుడ్డా వర్గం ఏరాసు ఇంటిపైకి దాడికి దిగింది. కర్రలు, రాళ్లు తీసుకుని ఏరాసు ఇంటిపై దాడికి దిగారు. ఈ ఊహించని దాడితో ఏరాసు బిత్తరపోయారట. అప్పటికే ఇంటి మెయిన్ గేటు వరకూ వచ్చేసి తలుపు బద్దలు కొట్టే యత్నం చేసిన బుడ్డా వర్గం.. ఒకానొక సమయంలో ఏరాసుపైనా చేయి చేసుకున్నారని సమాచారం. సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకుని బుడ్డా వర్గాన్ని అక్కడి నుంచి బలవంతాన పంపించివేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

అయినా ఇలా ఒకే పార్టీకి అది కూడా అధికార పార్టీకి చెందిన నేతల మధ్య ఇంత గలాటా ఎందుకు జరిగిందంటే… గతంలో బుడ్డా, ఏరాసు ఫ్యామిలీలు రాజకీయంగా బద్ధ శత్రువులు. బుడ్డా టీడీపీలో ఉంటే… ఏరాసు కాంగ్రెస్ లో ఉండేవారు. దీంతో ఎన్నికలు వచ్చాయంటే ఆత్మకూరులో రణరంగమే కనిపించేంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఏరాసు టీడీపీలోకి చేరి… శ్రీశైలాన్ని వదిలి పాణ్యం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయాలు చేశారు. చాలాకాలంగా ఆయన అంతగా యాక్టివ్ గా కూడా లేరు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలోకి ప్రవేశించడమే కాకుండా గతంలో తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న నేత ఇంటికి ఎంపీ ఎలా వెళతారన్న భావనతో బుడ్డా ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం.