2 వారాలు ఓకే.. తర్వాతేంటి?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జరిపిన పర్యటన సందర్భంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మరణించారు. వారిలో సింగయ్య నేరుగా జగన్ కారు ముందు టైరు కింద పడే చనిపోయినట్టుగా ఆ తర్వాత వీడియోలు బయటకు వచ్చి వైరల్ అయ్యాయి. వీటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు…కారులోని జగన్ పైనా కేసు పెట్టారు. ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం మరోమారు హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు వారాల పాటు కేసుపై స్టే విధించిన కోర్టు… అంతదాకా తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఈ రెండు వారాల పాటు పిటిషన్ పై స్టే విధించడానికి కారణం జగన్ తరఫు న్యాయవాదులు కాదు… ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోరిక మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించాల్సి ఉందని, దీంతో ఓ రెండు వారాల పాటు కేసును వాయిదా వేయాలని సర్కారు కోరింది. అందుకు కోర్టు సరే అనగా… అప్పటిదాకా తమ క్లెయింట్లపై చర్యలు కూడా తీసుకోరాకుండా ఆదేశాలు జారీ చేయాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఇందుకూ కోర్టు సరేనని చెబుతూ కేసుపై స్టే విధిస్తూ… తొందరపాటు చర్యలు వద్దని చెప్పింది.

కేసు పై స్టే, చర్యలు వద్దంటూ తాత్కాలిక ఆదేశాలు చాలా కేసుల్లో సర్వసాధారణమే. ఈ తీర్పుతో అటు ప్రభుత్వానికి లాభమే. ఇటు జగన్ కు రెండు వారాల పాటు ఉపశమనమే. అయితే రెండు వారాల తర్వాత పరిస్థితి ఏమిటి? ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టక తప్పదు కదా. మరి అప్పటిదాకా ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన సాక్ష్యాలు సంపాదించి కోర్టుకు సమర్పిస్తే… కేసు బలీయమైతే.. జగన్ కు కష్టాలు తప్పవు కదా. అదే సమయంలో జగన్ కూడా తన తరఫు గట్టి వాదనలు వినిపించే తన పార్టీ ఎంపీ నిరంజన్ రెడ్డిని బరిలోకి దింపారు. దీంతో జగన్ ను నిరంజన్ రెడ్డి బయటపడేయొచ్చు కూడా.

మంగళవారం నాటి హైకోర్టు తీర్పుతో జగన్ కు రెండు వారాల పాటు ఊరటే తప్పించి శాశ్వత ఊరటేమీ కాదు. అదే సమయంలో పోలీసులు కూడా ఈ కేసులో ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా.. ఏమాత్రం రెస్ట్ మోడ్ లోకి వెళ్లి… ఆధారాల సేకరణలో వెనుకబడ్డా… జగన్ బయటపడిపోవచ్చు. ఈ లెక్కన రెండు వారాల పాటు ఇరు వర్గాలకు ఊరట దక్కినట్టేనని చెప్పక తప్పదు. రెండు వారాల తర్వాత మాత్రం ఈ కేసు మరోమారు వాయిదా పడే అవకాశాలు లేవన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి.