జూనియర్ చెవిరెడ్డికీ ఇక జైలే గతి!

ఏపీలో లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య సోమవారం నాటికి 11కి చేరింది. ఈ సంఖ్య త్వరలోనే 12కు చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆ 12 అరెస్టు మరెవరిదో కాదు…చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి పెద్ద కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని తెలుస్తోంది. ఈ కేసులో 39వ నిందితుడిగా ఉన్న మోహిత్ తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అటు ట్రయల్ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టును కూడా కోరారు. ఈ రెండు చోట్లా సోమవారం ఆయనకు ఎదురుదెబ్బే తగిలింది.  మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఫలితంగా మోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు రంగంలోకి దిగారు.

అదే సమయంలో లిక్కర్ స్కాంలో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు సోమవారం మరోమారు మోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు సిట్ నోటీసులు జారీ చేసినా మోహిత్ విచారణకు హాజరు కాలేదు. తాను ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నానని, అవి తేలాక విచారణకు వస్తానన్న రీతిలో సాగిన మోహిత్.. రేపు విచారణకు హాజరు కాకపోతే మాత్రం సిట్ రంగంలోకి దిగడం ఖాయంగానే కనిపిస్తోంది. ఒకవేళ మోహిత్ విచారణకు వచ్చినా.. విచారణ అనంతరం ఆయనను సిట్ అరెస్టు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఎప్పుడైతే చెవిరెడ్ది అరెస్టు అయ్యారో… మోహిత్ రెడ్డి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. భాస్కర్ రెడ్డి, మోహిత్ తో పాటు మరో నలుగురిని కొత్తగా కేసులో నిందితులుగా చేర్చగా… వీరిలో ఇప్పటిదాకా భాస్కర్ రెడ్డి సహా ముగ్గురు నిందితులు అరెస్టు అయ్యారు. మోహిత్ తో పాటు ఇంకో నిందితుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. మంగళవారం మోహిత్ విచారణకు హాజరుకాకపోతే…వీరిద్దరి కోసం సిట్ జల్లెడ పట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే… మోహిత్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు. లండన్ ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అందులో డిస్టింక్షన్ పాసై గర్వంగా చంద్రగిరి చేరుకున్నారు. మోహిత్ చదువుకున్న రంగంలోనే ఆయన కొనసాగి ఉంటే… ఈ అరెస్టుల గోలే ఉండేది కాదు. అయితే జగన్ ఒక్కసారి సీఎం కాగానే భాస్కరరెడ్డి అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఉన్నత ఉద్యోగంలో కొనసాగాల్సిన తన కుమారుడిని రాజకీయాల్లోకి దింపారు. మొన్నటి ఎన్నికల్లో తన స్థానంలో మోహిత్ ని నిలిపారు. అయితే తండ్రితో పాటు మోహిత్ కూడా ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు మోహిత్ ఏకంగా జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.