బాబు గారూ!… ఇదేం స్టామినా సారూ!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వయస్తు ప్రస్తుతం అక్షరాలా 76 ఏళ్లు. ఇన్నేళ్ల వయసులో ఇతరులైతే ఏ వీల్ చైర్ కో, లేదంటే ఒకింత నడుస్తున్నా… పట్టుమని పది నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నారు. అయితే చంద్రబాబు ఏకంగా గంటా 45 నిమిషాల పాటు ప్రసంగించి… అది కూడా నిలబడి మరీ ప్రసంగించి… అందరినీ ఆశ్యర్యానికి గురి చేశారు. 1.45 గంటల సేపు ఆయన వేదిక మీద ఒకే చోట నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ తరం యువకులనే షాక్ కు గురి చేశారు.

కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అదికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఆ తర్వాత మైకు అందుకున్న చంద్రబాబు నాన్ స్టాప్ గా 1.45 గంటల పాటు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కొనసాగించారు.

ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ముందుగానే ఏర్పాటు చేసుకున్న స్లైడ్ లను అలా రన్ చేస్తూ… వాటిలోని ప్రతి అంశాన్ని వివరిస్తూ చంద్రబాబు సాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజెంటేషన్ ను చూస్తుంటే… ఆ స్లైడ్ లన్నింటినీ చంద్రబాబే రూపొందించుకున్నారేమో అనే భావన కూడా కలగక మానదు. దాదాపుగా అన్ని ప్రభుత్వా శాఖల పనితీరు, ఆయా సంక్షేమ పథకాల అమలు తీరు, త్వరలో ప్రారంబించబోయే పథకాలు వివరాలు… ఆయా పథకాల వల్ల జనానికి కలిగే లాభం, ప్రభుత్వంపై పడే బారం… అంతిమంగా సమాజం అభివృద్ధి చెందే తీరు, జీఎస్డీపీ పెరిగే తీరు తదితరాలను చంద్రబాబు ఓ లెక్చరర్ మాదిరిగా అలా చెప్పుకుంటూ వెళ్లారు.

బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో ఈ సమావేశానికి హాజరైన వారిలో కొందరు కునికిపాట్లు పడ్డా… చంద్రబాబు వాయిస్ తో తిరిగి లేచి ఆయన చెప్పే విషయాలను వినడంలో నిమగ్నమైన తీరు కనిపించింది. తాను ప్రసంగిస్తున్నంతసేపూ బాబు కూర్చోలేదు. ఏ సపోర్ట్ నూ పట్టుకోలేదు. అంతేనా… ఓ చేతిలో మైకును, మరో చేతిలో పిన్ పాయింటర్ ను పట్టుకుని బాబు అలా సాగిపోయారు. ఈ తరహా ప్రసంగాలకు బాబు తన తలకు అమర్చుకునే స్పీకర్ ను వాడతారు గానీ..ఎందుకనో సోమవారం నాటి సభలో మాత్రం ఆయన చేతి మైకునే వినియోగించారు.