కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లివ్వటమే తప్పయిపోయిందా ?

బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత వస్తున్న విశ్లేషణల తర్వాత ఇదే నిజమనిపిస్తోంది. 243 అసెంబ్లీ సీట్ల అసెంబ్లీలో ఆర్జేడీ, కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కలిసి మహాగట బంధన్ అనే కూటమిగా పోటీ చేశాయి. అయితే అంతిమ ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే తప్పు ఎక్కడ జిరిగిందో అర్ధమైపోతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఇవ్వటమే ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ చేసిన తప్పని తేలిపోయింది.

243 సీట్లలో ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేసింది. కాంగ్రెస్ కు 70 సీట్లను కేటాయించింది. వామపక్షాలు మరో 25 సీట్లలో పోటీ చేశాయి. అయితే ఆర్జేడీ పోట చేసిన సీట్లలో 76 గెలుచుకుంది. అలాగే సీపీఐ ఎంఎల్ 19 సీట్లలో పోటీ చేసి 12 గెలుచుకుంది. సీపీఐ 6 సీట్లలో పోటీ చేస్తే రెండు గెలిచింది. ఇక సీపీఎం 4 సీట్లలో పోటీచేసి రెండు గెలిచింది. ఇదే కాంగ్రెస్ విషయానికి వస్తే 70 చోట్ల పోటీ చేస్తే గెలిచింది 19 మాత్రమే. అంటే 51 సీట్లను అప్పనంగా ఎన్డీయే కూటమికి అప్పగించేసింది. కూటమిలో కూడా ఎక్కువ సీట్లను బీజేపీనే గెలుచుకున్నట్లు అర్ధమవుతోంది.

నిజానికి 70 సీట్లలో పోటీ చేసేంత సీన్ కాంగ్రెస్ కు లేదు. ఇదే విషయమై తేజస్వీ ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ నేతలు వినలేదట. అసలు కాంగ్రెస్ అడిగింది 76 సీట్లు. ఎట్టి పరిస్దితుల్లోను 76 సీట్లకన్నా తగ్గేది లేదని గట్టిగానే పట్టుబట్టింది కాంగ్రెస్. అయితే 76 సీట్లు ఎట్టి పరిస్ధితుల్లోను ఇచ్చేది లేదని కాదు కూడదంటే పొత్తులో నుండి బయటకు వెళ్ళిపోవచ్చని తేజస్వీ గట్టిగా చెప్పిన తర్వాతే కాంగ్రెస్ ఓ ఆరు సీట్లను తగ్గించుకుని 70 దగ్గర ఆగిపోయింది.

ఇపుడు ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే అసలు కాంగ్రెస్ కు అన్ని సీట్లు ఇవ్వకుండా ఏ 20 లేకపోతే 30 సీట్ల దగ్గరే ఆపేసుంటే పరిస్దితి వేరే విదంగా ఉండేదని ఆర్జేడీ వర్గాలంటున్నాయి. నిజంగానే తేజస్వి గనుక ఆ పని చేసుంటే బహుశా ఇపుడు మహాగట్ బంధనే అధికారంలోకి వచ్చుండేదేమో ? ఎన్డీయే కూటమిలో జేడీయు ఎలా దెబ్బకొట్టిందో ఎంజీబిని కాంగ్రెస్ కూడా అలాగే దెబ్బ కొట్టిన విషయం అర్ధమైపోయింది. ఏం చేస్తాం బెటర్ లక్ నెక్ట్స్ టైం అని తేజస్వికి చెప్పటం తప్ప.